హైదరాబాద్ : రాష్ర్టంలోని నాయి బ్రాహ్మణులకు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఉచిత విద్యుత్ పథకం అమలుపై అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు.
ఈ పథకం కింద ఇప్పటి వరకు 28,550 మంది ధరఖాస్తు చేసుకున్నట్లు సీఎస్ వెల్లడించారు. ఇందులో 10,637 ధరఖాస్తులు రజకుల కమ్యూనిటీ నుండి, 17,913 ధరఖాస్తులు నాయిబ్రాహ్మణుల కమ్యూనిటీ నుండి వచ్చాయన్నారు. అయితే ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమ అధికారులు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించాలని ఆదేశించారు. లబ్ధిదారులు తమ ధరఖాస్తులను ఉచితంగా మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకునేలా సౌకర్యాన్ని కల్పించాలని ఐటీ అధికారులను ఆదేశించారు. సీజీజీలో నమోదు చేసుకున్న దరఖాస్తులను వెంటనే సంబంధిత డిస్కంలకు పంపించాలని ఆదేశించారు. తద్వారా ఉచిత విద్యుత్ పథకాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, బీసీ వెల్ఫేర్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్ రావు, TSSPDCL, CMD రఘుమారెడ్డి, బీసీ వెల్ఫేర్ అడిషనల్ సెక్రటరీ సైదా, వాషర్ మెన్ ఎండీ చంద్రశేఖర్, నాయి బ్రాహ్మణ్ ఎంసీ విమలతో పాటు తదితర అధికారులు పాల్గొన్నారు.