హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్-19కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం బీఆర్కే భవన్లో ఆయా శాఖల అధికారులతో ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత సీఎస్ సోమేశ్ కుమార్ తొలిసారిగా ఈ సమీక్ష నిర్వహించారు.
సమీక్ష సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. కొవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో బెడ్ల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకోవాలని, కేసులు పెరిగితే ఉత్పన్నమయ్యే పరిస్ధితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
జిల్లాల్లో టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ కు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ప్రజలు పాటించేలా నిబంధనల అమలుకు కృషిచేయాలని ఆదేశించారు. ప్రజలు మాస్కులు ధరించేలా చూడాలని, కోవిడ్ కేర్ సెంటర్లను రెట్టింపు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఆక్సీజన్ ను సక్రమంగా వినియోగించి, వృధాను అరికట్టేలా చైతన్యపరచాలని సూచించారు.
ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఏఎమ్ రిజ్వీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ర్టేషన్ డైరెక్టర్ ప్రీతి మీనా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, వైద్యారోగ్య శాఖ అడ్వైజర్ టీ గంగాధర్, MD-TSHMIDC చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..