హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): సెకండ్వేవ్లో తీవ్రంగా విజృంభిస్తున్న కరోనాను కట్టడిచేయడంకంటే.. దాన్ని ముందే నియంత్రించే దిశగా ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణ ప్రారంభించింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇప్పటివరకు అమలుచేయని విధంగా ఇంటింటికీ వైద్య బృందాలను పంపించి సర్వే నిర్వహిస్తూనే.. కరోనా లక్షణాలున్న వారికి వైద్యసలహాలు, ప్రాథమిక చికిత్స, మందుల పంపిణీ తక్షణం చేసేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు మొదలుపెట్టింది. రాజధాని హైదరాబాద్లో ఇప్పటికే సర్వే మొదలైంది. జ్వర సర్వేలో భాగంగా.. క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇంటింటికి వెళ్లనున్నారు. లక్షణాలు ఉన్నవారిని పరీక్షించి కొవిడ్ బాధితులను గుర్తిస్తారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రతి 250 ఇండ్లకు (ప్రతి వెయ్యి మందికి) ఏఎన్ఎం, ఆశా వర్కర్ మున్సిపాటిటీ లేదా గ్రామ పంచాయతీ ఇద్దరి సిబ్బందితో ఏర్పాటు చేసిన బృందం వెళ్తుంది. అనుమానం ఉన్న వారికి జ్వరం, పల్స్, ఇతర ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు.
కోవిడ్ లక్షణాలు ఉన్నవారి వివరాలు నమోదు చేసుకొని అక్కడిక్కడే హోం ఐసోలేషన్ కిట్లు అందజేస్తారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, మందులు ఎలా వాడాలో వంటి వివరాలను చెబుతారు. ఒకవేళ వారం పాటు జ్వరం తగ్గకపోతే స్టెరాయిడ్ మందులను కూడా అందిస్తారు. ఈ వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం బీఆర్కే భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమలు చేయబోతున్న అద్భుతమైన కార్యక్రమం గురించి పేర్కొన్నారు. ఆసుపత్రులు, పడకల మీద భారం తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశమని సీఎస్ తెలిపారు. ఈ చర్యల వల్ల రోగులను ముందే గుర్తించడం, వారికి భరోసా ఇవ్వడం సాధ్యం కానున్నదని, లక్షణాలు ఉన్న వారికి ఇంట్లోనే చికిత్స అందించడం వల్ల 25-30శాతం వరకు పడకల మీద లోడ్ తగ్గుతుందని భావిస్తున్నామన్నారు. ‘ఇంటింటికి వెళ్లి పరీక్షలుచేసే బృందాలకు ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లోని ఏ ఏ ఇండ్లలో పేషెంట్లు ఉన్నారో తెలుస్తుంది. బాధితులను ఆదుకోవడం, వారికి వైద్య సహాయం అందించడం సులువవుతుంది’ అని చెప్పారు.
పీహెచ్సీ, ఏరియా, జనరల్ ఆసుపత్రుల్లో నేటి నుంచి కోవిడ్ ఔట్ పేషెంట్ సేవలు నిర్వహిస్తున్నట్లు చెప్పిన ఆయన, ఈ నిర్ణయం వల్ల డాక్టర్ కన్సల్టేషన్ లభించలేని ఎంతో మంది లబ్ధి పొందుతారన్నారు. ఇప్పటికే కొందరు సొంతంగా మందులు వేసుకోవడం వంటివి చేస్తున్నారని ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పారు. మరోవైపు సొంతంగా మందులు వాడిన వారిలో చాలా మంది వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారన్నారు. అయితే అప్పటికే విలువైన సమయం వృథా అవుతుందన్నారు. అందుకే దీనికి పరిష్కారంగా ఓపీ సేవలు నిలవబోతున్నాయన్నారు. సులువుగా వైద్యుల కన్సల్టేషన్ లభించడం వల్ల ముందుగానే మందులు వాడటం మొదలవుతుందని, దీని వల్ల పేషెంట్ ఆరోగ్య పరిస్థితి ప్రమాదకర స్థితి చేరుకునే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. ఎంతోమందిని కాపాడుకోవడం సాధ్యం కానుందన్నారు. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం, ముదరకుండా ఆపడం సాధ్యమవుతుందన్నారు.
జీహెచ్ఎంసీలో మంచి ఫలితాలు
ఇంటింటికి వెళ్లి లక్షణాలు ఉన్న వారి ఆరోగ్య వివరాలు సేకరించిన తర్వాత వారిని ఫోన్ నంబర్ ద్వారా ఫోన్లో మానిటర్ చేస్తారని తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో సీరియస్ కేసులు రావని చెప్పారు. జీహెచ్ఎంసీలో రెండు రోజులుగా ఈ పని జరుగుతున్నదని, మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. కరోనా లక్షణాలు ఏ మాత్రం కనిపించినా వెంటనే వైద్యం చేయాలని ఐసీఎంఆర్ చెప్పిందని, ఈ మేరకు లక్షణాలు కనిపించిన వెంటనే టెస్టులు, రిపోర్టుల కోసం ఆలోచించకుండా వైద్యం చేసుకోవాలని సీఎస్ సూచించారు. మల్టీమిటమిన్, పారాసిటమాల్, యాంటిబయాటిక్లు ఐదురోజులు వేసుకుంటే సరిపోతుందని, తర్వాత కూడా అలాగే ఉంటే కిట్లోని స్టెరాయిడ్లు వాడాలని వివరించారు. లక్షణాలుంటే వెంటనే మెడికల్ కిట్స్ ఇస్తారని చెప్పారు. సెకండ్ వేవ్లో తక్కువ సమయం కాంటాక్ట్లో ఉన్నా వైరస్ సోకుతున్నదని తెలిపారు. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
ప్రతి జిల్లాలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ల్యాబ్లు
ప్రతి జిల్లాలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ల్యాబ్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని సీఎస్ సోమేశ్కుమార్ చెప్పారు. ప్రస్తుతం 17 ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు ఉన్నాయని, మరో 14 ఏర్పాటు కాబోతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎన్-95 మాస్క్లు 25 లక్షలు, పీపీఈ కిట్లు 6 లక్షలు, 3-ైప్లె మాస్క్లు 85 లక్షలు ఉన్నాయని వివరించారు. ఆర్టీసీపీఆర్ కిట్స్ 3 లక్షలు, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ 11 లక్షలు, హోం ట్రీట్మెంట్ కిట్స్ 6.38 లక్షలు, రెమ్డెసివిర్ 90 వేలు, టోసిలిజుమామ్ 63 వైల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కేంద్రం నుంచి సమస్య వస్తున్నదని, అక్కడ చాలా కోఆర్డినేట్ చేస్తున్నామని చెప్పారు. రెమ్డెసివిర్ అందుబాటులో ఉన్నదని, కానీ.. ఇది అవసరం ఉందా లేదా అనేది డాక్టర్లు నిర్ణయిస్తారన్నారు. కొత్తగా ఆర్డర్ చేసిన 5 లక్షల డోసులు త్వరలో వస్తాయని చెప్పారు. కేంద్రం మొదట్లో రోజుకు 5 వేల ఇంజెక్షన్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రెమ్డెసివిర్ను బ్లాక్లో అమ్మేవారిని అరెస్టు చేశామని చెప్పారు. రోజుకు 25 వేల డోసులు కావాలని, కోర్టు కూడా కేంద్రానికి డైరెక్షన్ ఇచ్చిందన్నారు. విదేశాల నుంచి తేవటానికి ప్రయత్నించామని, ఫార్మా ప్రతినిధులతో మాట్లాడామని చెప్పారు.
ఎవరూ భయపడవద్దు
మన రాష్ట్రంలో పరిస్థితి చాలా బాగున్నదని సీఎస్ సోమేశ్కుమార్ స్పష్టంచేశారు. కొంత సమస్య ఉన్నట్టు సోషల్మీడియాలోనే దుష్ప్రచారం జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్య రాదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఈ విషయంలో ప్రజలకు ధైర్యం కల్పించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ సేవలు అందించేందుకు రాష్ట్రంలో 104, 108 కాల్సెంటర్లు నడుస్తున్నాయని తెలిపారు. జీహెచ్ఎంసీలో 040-21111111 నెంబర్తో కాల్ సెంటర్ ప్రారంభించామని చెప్పారు. కాల్ సెంటర్లను ఏర్పాటుచేస్తామన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి మరణాన్ని రికార్డ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
చికిత్సల రాజధాని హైదరాబాద్
మొదటి వేవ్ తర్వాత ఇతర రాష్ర్టాల మాదిరిగా పని అయిపోయిందని మనం అనుకోలేదని, అప్రమత్తంగానే ఉండి.. వైద్య మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేశామని సీఎస్ సోమేశ్కుమార్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి బెడ్ను ఆక్సిజన్ బెడ్గా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గతేడాది సెప్టెంబర్లో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ చికిత్సకు 18 వేల బెడ్స్ ఉంటే, ఇప్పుడు 52 వేలకు పెంచామని చెప్పారు. దీంతో కేసులు పెరిగినా ఇబ్బంది రాలేదన్నారు. ఈ రోజు హైదరాబాద్ మెడికల్ ట్రీట్మెంట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా అభివృద్ధి అయిందని తెలిపారు. రాష్ట్రంలోని దవాఖానల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని చెప్పా రు. 15 రోజుల్లో 33 మెడికల్ అంబులెన్స్లు ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్కు వచ్చాయని, ఢిల్లీ నుంచి ఎయిర్ అంబులెన్స్లు వచ్చాయని తెలిపారు.
అందరూ ఒకే దగ్గరకు వెళ్లడంతో సమస్య
అందరూ పెద్ద హాస్పిటల్కు వెళ్లాలనుకోవడంతోనే సమస్య వస్తుందని సీఎస్ సోమేశ్కుమార్ అన్నారు. చాలా బెడ్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టంచేశారు. మధ్యస్థ లక్షణాలుంటేనే హాస్పిటల్లో అడ్మిషన్ అవసరమని చెప్పారు. 79 కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని, హోటల్స్ను లింక్ చేయడం ద్వారా 1800 బెడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. పలువురు సీనియర్ అధికారులు నిమ్స్ వంటి ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స తీసుకున్నారని అన్నారు. ఫీజుల విషయంలో నిర్దిష్ట ఫిర్యాదులు ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తగ్గుతున్న వైరస్ వ్యాప్తి
గత పది రోజుల ట్రెండ్ చూస్తే ఇది అర్థమవుతుందన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాలు, మార్గనిర్దేశనం మేరకు ప్రభుత్వ యంత్రాంగం కొవిడ్ నియంత్రణకు కృషిచేస్తున్నదని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉన్నదన్నారు. త్వరలోనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో కూడా రాబోదని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ లక్షణాలుంటే వెంటనే చికిత్స తీసుకోవాలని కోరారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణలో మనవాళ్లతోపాటు.. పొరుగు రాష్ర్టాల నుంచి కూడా వచ్చి కొవిడ్కు వైద్యం చేయించుకుంటున్నారన్న సీఎస్.. హైదరాబాద్ మెడికల్ ట్రీట్మెంట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా అవతరించిందని చెప్పారు. బుధవారం బీఆర్కే భవన్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, డీఎంహెచ్వోలతో టెలికాన్ఫరెన్స్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్లు, నర్సులు, ఇతర ఉద్యోగులు, కలెక్టర్లు అంతా కష్టపడి పనిచేస్తున్నారని, దీంతో ఇతర రాష్ర్టాల కంటే మన పరిస్థితి చాలా నియంత్రణలో ఉన్నదని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు కరోనా సోకినప్పటికీ.. రోజుకు 3, 4 సార్లు టచ్లో ఉండి, వైరస్ నియంత్రణకు తమకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారని, నిధుల ఖర్చుకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
సరిపడా ఆక్సిజన్ ఉంది..
రాష్ట్రంలోని దవాఖానల్లో 600 టన్నుల ఆక్సిజన్ అందుబాటులో ఉన్నదని సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 125 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నదని, 430 మెట్రిక్ టన్నులను కేంద్రం ఏర్పాటు చేసిందని వివరించారు. ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక నుంచి కేంద్రం మనకు ఆక్సిజన్ను కేటాయించిందని చెప్పారు. ఒడిశాకు ఒక ట్యాంకర్ వెళ్లి రావడానికి ఆరు రోజులు పడుతుందని, సమయం ఆదా చేసేందుకు దేశంలోనే మొదటిసారి సైనిక రవాణా విమానాలను ఉపయోగించామని తెలిపారు. దీంతో ప్రతి ట్యాంకర్కు మూడు రోజులు ఆదా అయిందన్నారు. 14 ట్రిప్పుల ద్వారా 48 ట్యాంకర్లు తెప్పించామని చెప్పారు. రైళ్లలోనూ ఆక్సిజన్ తెప్పించి సమయం ఆదా చేస్తున్నామని చెప్పారు. 27 రీఫిల్లర్స్ వద్ద టీంలను పెట్టి, ఆక్సిజన్ మేనేజ్మెంట్ చేస్తున్నామని వివరించారు.
ప్రస్తుతం 45 ఏండ్లు దాటినవారికే టీకా
వ్యాక్సినేషన్ విషయంలో మే 1 తర్వాత కేంద్ర విధానం మారడంతో స్పష్టత కరువైందని సీఎస్ సోమేశ్కుమార్ చెప్పారు. ప్రస్తుతం 45 ఏండ్లు దాటినవారికే టీకాలు వేస్తున్నట్టు తెలిపారు. గతంలో నేరుగా వెళ్లినా వ్యాక్సిన్ ఇచ్చారని, ఇప్పుడు ముందు రిజిస్టర్ చేసుకున్నవారికే టీకా ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 42.24 లక్షల మందికి టీకాలు వేసినట్టు తెలిపారు. ప్రైవేట్లో వ్యాక్సినేషన్ జరుగడం లేదన్నారు. మూడో దశ వ్యాక్సినేషన్లో 18 ఏండ్లు దాటిన వారికీ టీకా వేయాలని చెప్పారని, కానీ.. కావాల్సినంత వ్యాక్సిన్ ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణలో 18-43 ఏండ్ల మధ్య వయసు జనాభా 1.70 కోట్లు ఉన్నదని, కనుక 3.40 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం అవుతుందని తెలిపారు. కానీ, మే నెలలో 3.90 లక్షల డోసుల వ్యాక్సిన్ మాత్రమే వచ్చిందని చెప్పారు. వంద మందికి ఒక్క వ్యాక్సిన్ పంపించారన్న సీఎస్.. దీంతో వ్యాక్సిన్ ఎలా వేయాలని ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడుతున్నామని తెలిపారు. మే నెలలో కనీసం 30-40 లక్షల వ్యాక్సిన్లు అడిగామన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ కూడా ప్రధానితో మాట్లాడుతారని, లేఖ రాస్తారని తెలిపారు. అప్పటి వరకు 18 నుంచి 44 సంవత్సరాల వారికి వ్యాక్సిన్లు తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పారు. అత్యవసరం కోసమే తాత్కాలికంగా ఔట్సోర్సింగ్ నియామకాలు చేపడుతున్నామని సీఎస్ వివరించారు. వైద్య విధాన పరిషత్, పబ్లిక్ హెల్త్ నుంచి 2,400 మంది నర్సులు, ఏఎన్ఎంలను రిక్రూట్ చేశామని వివరించారు.