హైదరాబాద్ : రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్ స్ట్రెంత్ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగ ఎంప్లాయీస్ యూనియన్స్, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లకు సిబ్బంది కేటాయింపును విజయవంతంగా పూర్తి చేయడానికి సహకారం అందించడంతో పాటు సలహాలు సూచనలు, అభిప్రాయాలను తెలపాల్సిందిగా సీఎస్ కోరారు.
పీఆర్సీ అమలు, ఉద్యోగులతో స్నేహపూర్వక విధానాలను పాటిస్తున్న సీఎం కేసీఆర్కు ఉద్యోగ సంఘాలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాయి. వివిధ క్యాడర్లకు అధికారుల కేటాయింపు గురించి ఉద్యోగుల సంఘాలు తమ అభిప్రాయాలను తెలియజేశాయి. ఇతర సహచరులు, యూనిట్లను సంప్రదించిన తర్వాత ఈ నెల 12వ తేదీన తగు సూచనలతో తిరిగి సీఎస్తో సమావేశం కానున్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి.
ఈ సమావేశంలో జీ.ఏ.డీ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, జీ.ఏ.డీ ఓఎస్డీ అప్పారావు, HRM & SER సీనియర్ కన్సల్టెంట్ శివ శంకర్, ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి రవి, హోం శాఖ ఎస్వో వనజ, OSD to CM సెక్రటెరీ కృష్ణమూర్తి, టీజీవోల అసోసియేషన్ ప్రెసిడెంట్ మమత, టీఎన్జీవో అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిళ్ల రాజేందర్ పాల్గొన్నారు.