హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): డాక్టర్లు సరైన చికిత్స అందిస్తున్నారా? దవాఖానల్లో పడకలు ఉన్నాయా? ఆక్సిజన్ సదుపాయం ఉందా లేదా? ఇంటింటికీ జ్వర సర్వే సరైన పద్ధతిలో జరుగుతున్నదా? అర్హులకు ఐసొలేషన్ కిట్లు అందుతున్నాయా? అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిని పరిస్థితిని తెలుసుకొనేందుకు నేరుగా దవాఖానలకు వెళ్తున్నారు. వైరస్ బాధితులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీస్తున్నారు. డాక్టర్లతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని పెంచుతున్నారు. శనివారం గోల్కోండ ఏరియా దవాఖానను సందర్శించారు. అక్కడి వసతులను పరిశీలించారు. అటు.. కరోనా కట్టడికి వినూత్న పద్ధతులతో రోగులను గుర్తించి, చికిత్స అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే నిర్వహిస్తున్నది. సర్వేపైనా సీఎస్ ఆరాతీశారు.
‘వ్యాక్సినేషన్కు గరిష్ఠంగా 15 నిమిషాలే పడుతుంది. అనంతరం 30 నిమిషాలు పరిశీలనలో ఉంచుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకొని 40-45 నిమిషాల్లో ఇండ్లకు తిరిగి వెళ్తున్నాం’ అని వ్యాక్సినేషన్కు వచ్చిన ప్రజలు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ వివరించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడంలేదని సంతోషంగా చెప్పారు. ఇతర సీనియర్ అధికారులతో కలిసి సీఎస్ గోలొండ ఏరియా దవాఖానను సందర్శించారు. రెండోడోస్ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. వ్యాక్సిన్ తీసుకొనేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. మొదటి డోస్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేయించుకుని నాలుగు వారాలు పూర్తయిన వ్యక్తులు, కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకుని ఆరు వారాలు పూర్తయినవారు ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఏదైనా ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంలో రెండో డోస్ వేయించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని సోమేశ్కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పడకలకు ఆక్సిజన్ పైప్లైన్ సదుపాయం కల్పించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇందులోభాగంగా 100 కొవిడ్ పడకలకు వారంలో ఆక్సిజన్ సరఫరా అందుబాటులోకి రానున్నదని తెలిపారు.
గోల్కొండ ఏరియా దవాఖానలో మరో 120 పడకల వార్డు నెల రోజుల్లో అందుబాటులోకి వస్తుందని సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పడకల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. అదనంగా 120 పడకల ఏర్పాటుకు అనువుగా దవాఖానపై మరో అంతస్తును నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. దవాఖానలో ప్రసూతి, అత్యవసర వైద్య సేవలకు సరిపడ పడకలను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. కొవిడ్ విపత్కర సమయంలో డాక్టర్లు, నర్సులు, ఇతర దవాఖాన సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు. సీఎస్ వెంట వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్రెడ్డి, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, టీఎస్ఐఐజీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.