హైదరాబాద్: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్రోడ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్ పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఎల్బీ స్టేడియం వరకు 3కే రన్ నిర్వహించారు. ఇందులో 1500 మంది విద్యార్థులు, వాకర్లు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్ను జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ప్రారంభించారు. ఎందరో త్యాగధనుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగిన ఈ రన్లో జిల్లా అధికారులు, యువకులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లాలో ప్రీడం రన్ను ఘనంగా నిర్వహించారు. అమృత్ మహోత్సవ్లో భాగంగా జిల్లా కేంద్రంలో 2కే రన్ను కలెక్టర్ సంగీత సత్యనారాయణ ప్రారంభించారు. ఏడాదిపాటు కొనసాగే ఈ కార్యక్రమాల్లో జిల్లా వ్యాప్తంగా ప్రజలు పాల్గొనాలని ఆమె కోరారు.
వనపర్తి జిల్లాలో జరిగిన ఫ్రీడమ్ రన్ను కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వ రావు జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజీ నుంచి బస్టాండ్ మీదుగా ఎకోపార్క్ వరకు ఈ రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ రాహుల్ హెగ్డే, కరీంనగర్ జిల్లాలో జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్డీవో శ్రీనివాస్, ములుగు జిల్లాలో కలెక్టర్ కృష్ణ ఆధిత్య ప్రారంభించారు.