భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో కొందరు భూమిని కబ్జా చేసి అందులో మూడంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మించగా, అధికారులు శనివారం ఆ భవనాన్ని కూల్చివేశారు. భోపాల్ జిల్లా అదనపు మెజిస్ట్రేట్ దిలీప్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కూల్చివేత ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో భాగంగా తాము ఎస్వోఎస్ బలగ్రామ్ నంది ఫౌండేషన్ వెనుకవైపున ల్యాండ్ కబ్జా చేసి నిర్మించిన మూడంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ను కూల్చివేశామని దిలీప్యాదవ్ ట్విట్టర్లో తెలిపారు.
కబ్జాకు గురైన ఆ జాగా ఖజురికలాన్ ఏరియాకు చెందిన ఓ కోఆపరేటివ్ సొసైటీకి చెందినదిగా దిలీప్ యాదవ్ వెల్లడించారు. తన ట్వీట్కు జిల్లా కలెక్టర్ను, భోపాల్ డీఐజీని ట్యాగ్ చేశారు. ఆక్రమణ భవనాన్ని కూల్చివేయడం ద్వారా అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మెథడ్ను ఉపయోగించి ఆ భవనాన్ని కూల్చినట్లు తెలిపారు.