హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): దేశంలో తొలిసారి ప్రభుత్వ అవసరాల కోసం ఉచితంగా భారీ సంఖ్యలో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను అందించేందుకు మేఘ ఇంజినీరింగ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ముందుకొచ్చింది. ఈ ట్యాంకర్లను థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నది. యుద్ధప్రాతిపదికన 11 ట్యాంకర్లను సేకరించి హైదరాబాద్కు తీసుకువస్తున్నది. వీటిని ప్రభుత్వానికి అందించనున్నది. ఇందులో భాగంగా వాయుసేనకు చెందిన ‘గజరాజ్’ విమానం చండీగఢ్ నుంచి నేరుగా బ్యాంకాక్ వెళ్లి శనివారం సాయంత్రం బేగంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్కు మూడు క్రయోజనిక్ ట్యాంకర్లను తీసుకొచ్చింది. ఈ ట్యాంకర్లతో కూడిన వాహనాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ట్యాంకర్లు రైలు మార్గం ద్వారా ఒడిశా వెళ్తాయని, అక్కడ ఆక్సిజన్ నింపుకొని రాష్ర్టానికి వస్తాయని వివరించారు. థాయిలాండ్ నుంచి తొలి విడుతగా మూడు ట్యాంకర్లు వచ్చాయని, మిగిలిన ట్యాంకర్లు 3,4రోజుల్లో హైదరాబాద్కు చేరుకుంటాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ రావు, ఎంఈఐఎల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సరిపడినంత ఆక్సిజన్ ఉన్నా..దేశంలో అవసరరాలకు సరిపడినంత ఆక్సిజన్ ఉన్నప్పటికీ దాన్ని సరఫరా చేయడానికి అవసరమైన ట్యాంకులు, రవాణా సదుపాయాలు లేవు. ఒక్కో క్రయోజనిక్ ట్యాంకర్ను తయారు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఎంఈఐఎల్ థాయిలాండ్ నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటున్నది. ఒక్కో ట్యాంకు ద్వారా దాదాపు 1.40 కోట్ల లీటర్ల ఆక్సిజన్ను సరఫరా చేసేందుకు వీలవుతుంది. ఈ విధంగా 11 ట్యాంకర్లతో ఒకేసారి 15.40 కోట్ల లీటర్ల ఆక్సిజన్ను సరఫరా చేయవచ్చని ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పీ రాజేశ్రెడ్డి తెలిపారు.మరోవైపు బొల్లారంలోని ఎంఈఐఎల్ ప్లాంట్లో నిరంతరం ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఏపీ, ఒడిశాలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా ఈ నెల 9 నుంచి 21 వరకు 29,694 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేసినట్టు ఎంఈఐఎల్ వర్గాలు వెల్లడించాయి.