హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ మేరకు అధికారులు పనిచేయాలని, స్ధానిక సంస్ధల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అదేవిధంగా గ్రామాల్లో రాత్రి బసలు చేసి పారిశుధ్ధ్యం ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశానుసారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్ధానిక సంస్ధలు), డీఎఫ్ఓలు, డీపివోలు, డీఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఇతర అధికారులతో స్ధానిక సంస్ధల నిర్వహణ పనితీరులో మెరుగుదల, తెలంగాణకు హరితహారం, ధరణి, వ్యాక్సినేషన్ లపై బీఆర్కేఆర్ భవన్ నుండి సీఎస్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, పచ్చదనం, గ్రామ సభల నిర్వాహణ, ప్రగతి నివేధికల తయారీ, సీజనల్ క్యాలండర్ తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. రిజర్వు ఫారెస్ట్ బ్లాక్ లలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం, జిల్లాలలో అన్ని రహదారుల వెంట మల్టీలెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్, పట్టణాలలో ఖాళీ స్ధలాలలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం, నూతనంగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత కార్యాలయ కాంప్లెక్సులలో పచ్చదనం, తదితర అంశాలను సీఎస్ సమీక్షించారు. మొక్కలు నాటడానికి గుంతల తవ్వకం, మిగిలిన గ్రామాలలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును పూర్తి చేయాలని కలెక్టర్లను కోరారు.
ధరణిలో పెండింగ్ ధరఖాస్తుల పరిష్కారం, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు స్ధలాలు అప్పగించడం తదితర అంశాలపై సీఎస్ ఈ సందర్భంగా చర్చించారు. వ్యాదుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సీఐజీ వి.శేషాద్రి, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, అటవీశాఖ పీసీసీఎఫ్ శోభ, పీసీసీఎఫ్ (ఎస్ ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియల్, సీఎం ఓఎస్డి ప్రియాంకా వర్గీస్, సీడీఎంఏ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.