హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): సూపర్ స్ప్రెడర్లందరికీ శుక్రవారం నుంచి వ్యాక్సిన్ వేయాలని, ఇందుకు ఏర్పాట్లుచేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లందరికీ వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై సీఎస్ బుధవారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ క్యాటగిరీల పనులుచేసే వారికి ఆయా విభాగాల అధికారులను ఇంచార్జీలు నియమించి, వారికి బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించినట్టు సమాచారం. ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిబ్బంది, పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది, రేషన్షాపుల డీలర్లకు ఇంచార్జీ అడిషనల్ కలెక్టర్లు.. ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు.. కూరగాయలు, పువ్వులు, పండ్లు, మాంసం, చేపలు విక్రయించేవారికి మున్సిపల్ కమిషనర్లు, మద్యం విక్రయించేవారికి ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, జర్నలిస్టులకు డీపీఆర్వోలు ఇంచార్జీలుగా ఉండి వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశించినట్టు తెలిసింది.
ప్రభుత్వానికి టీయూడబ్ల్యూజే కృతజ్ఞతలు
జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లం నారాయణ, ఆస్కాని మారుతీసాగర్, టెమ్జూ అధ్యక్ష, కార్యదర్శులు ఇస్మాయిల్, రమణకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అక్రెడిటేషన్ కార్డు లేకపోయినా ఎంప్యానల్లో ఉన్న పత్రికలు, న్యూస్ చానెళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా వ్యాక్సిన్ అందించాలని విజ్ఞప్తి చేశారు.