న్యూఢిల్లీ : రానున్న మూడో రోజుల్లో ప్రతి రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతానికి 96,490 వ్యాక్సిన్ డోసులు అందుతాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే 1,40,70,422 వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు 25,27,66,369 డోసులను( వృథాతో కలిపి) వినియోగించినట్లు వెల్లడించింది. మే 1 నుంచి ప్రారంభమైన మూడో విడుత వ్యాక్సినేషన్ను సరళంగా, వేగంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి నెలా సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ (సీడీఎల్)లో అనుమతితో తయారు చేసే టీకాల్లో 50 శాతం కేంద్రం సేకరించి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 25, 48,49,301 డోసులను సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించేందుకు వీలుగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థలకు 1,06,300 యాంఫోటెరిసిన్ బీ వయల్స్ను కేటాయించినట్లు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ తెలిపారు. సోమవారం ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థలకు 53,000 లిపోసోమల్ యాంఫోటెరిసిన్ బీ వయల్స్ను పంపినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.