భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణం చోటుచేసుకుంది. తన కుమార్తె వయసున్న మైనర్ బాలికపై ఓ వ్యక్తి చెత్తకుండీలో లైంగిక దాడికి పాల్పడిన ఘటన నగరంలోని అయోధ్య నగర్లో శనివారం సాయంత్రం వెలుగుచూసింది. గతంలో ఇంటి వద్ద ఆడుకుంటుండగా నిందితుడిని పలుమార్లు చూశానని బాధితురాలు పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల బాధిత బాలిక (8) ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఘటన జరిగిన రోజు బాలిక ఇంటివద్ద ఆడుకుంటుండగా నిందితుడు ఆమె వద్దకు వచ్చి సమీప షాపులో చుట్ట తీసుకురావాలని రూ వంద ఇచ్చి పంపాడు.
బాలిక చుట్ట తీసుకురాగానే చెత్త కుండీ పక్కన నిలుచున్న వ్యక్తికి దాన్ని ఇవ్వాలని చెప్పాడు. బాలిక అక్కడికి వెళ్లగానే నిందితుడు ఆమెను చెత్తకుండీలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నిందితుడు బాలికకు రూ 5 ఇచ్చాడు. జరిగిన దారుణాన్ని బాలిక కుటుంబసభ్యులకు వివరించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసలు ఎనిమిది బృందాలుగా విడిపోయి నిందితుడిని గాలించారు. 40 మంది అనుమానితుల ఫోటోలను పోలీసులు చూపగా బాధిత బాలిక నిందితుడిని గుర్తించింది. నిందితుడు గుజరాత్ పారిపోతుండగా ఓ మద్యం దుకాణం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.