నాలుగు రూపాయలు మిగులుతాయనే ఆశతోనే ఏ రైతైనా ఆరుగాలం కష్టించి పంట పండిస్తాడు. అలాంటిది పండిన పంటను అమ్ముకుంటున్నప్పుడు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకుంటే ఆ రైతు పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే రైతులు సంప్రదాయ పంటల సాగును పక్కనపెట్టి.. పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్లో డిమాండ్గల పంటలను పండిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా కష్టానికి తగిన ప్రతిఫలం పొందవచ్చు. అందుకే .. రైతులను సంపన్నులను చేయడానికి, వ్యవసాయాన్ని సుసంపన్నంచేయడానికి తెలంగాణ ప్రభుత్వం మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న పత్తి, కంది, వేరుశనగ, శనగ, ఆయిల్పామ్ వంటి పంటలను సాగుచేయాలని సూచిస్తున్నది.
దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అవసరానికి మించి భారీ మొత్తంలో ధాన్యం, బియ్యం ఉత్పత్తి అవుతుంటే.. వరి పంటకు డిమాండ్ ఎక్కడ ఉంటుంది. ఒక ప్రాంతంలో సాగై.. మరో ప్రాంతంలో సాగు కాని పక్షంలో ఎగుమతులకు, దిగుమతులకు అవకాశం ఉంటుంది. కానీ ఎవరికి వారే పుష్టిగా పండిస్తున్నప్పుడు ఎగుమతి, దిగుమతుల అవసరం ఎందుకు వస్తుంది. అప్పుడు ప్రభుత్వాలు మాత్రం.. రైతుల నుంచి అవసరానికి మించి ధాన్యం కొనుగోలు చేసి ఏం చేసుకుంటాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాబట్టి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పత్తి, కంది, శనగ, వేరుశనగ, ఆయిల్ పామ్ వంటి మద్దతు బహుబాగా లభించే పంటలను పండించడం లాభదాయకమని ప్రభుత్వం, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
ఓ పక్క వ్యవసాయాన్ని పండుగ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి.. రైతులను అనిశ్చితిలోకి నెట్టేసింది. ఇప్పటికీ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియని అయోమయంలో రైతులు పడ్డారు. కేంద్రం రైతులను అనిశ్చితిలోకి నెడితే.. తెలంగాణ మాత్రం రైతులను అక్కున చేర్చుకున్నది. కంటికి రెప్పలా కాపాడుకుని మార్గదర్శకంగా నిలిచింది. రైతన్న పండించే ప్రతి గింజను కొనుగోలు చేసి భరోసానిచ్చింది. ఇది చాలదా రైతుకు ఒక బాధ్యత గల ప్రభుత్వం చేసేది. చేయగలిగేది!
రాష్ట్ర ప్రభుత్వం ప్రొత్సహిస్తున్న పత్తి, కంది, వేరుశనగ, శనగ, ఆయిల్పామ్ పంటలన్నీ కూడా మద్దతు ధర కన్నా ఎక్కువ ధర దక్కేవే కావడం గమనార్హం. వీటి సాగుతో రైతు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోడు. పత్తికి గతేడాది మద్దతు ధర క్వింటాలుకు రూ.5,825 ఉండగా రైతుకు రూ.6 వేల నుంచి రూ.6,300 వరకు ధర పలికింది. కందికి రూ.6 వేలు మద్దతు ధర ఉండగా రూ.6,500 వరకు దక్కింది. వేరుశనగకు రూ.5,275 మద్దతు ధర ఉండగా రైతుకు రూ.5,500 వరకు దక్కింది. శనగలదీ అదే పరిస్థితి. ఇక ఆయిల్పామ్ ధర విపరీతంగా పెరుగుతున్నది. గతంలో రూ.8-9వేలుగా ఉన్న టన్ను గెల ధర ఇప్పుడు ఏకంగా రూ.19 వేలకు పెరిగింది.
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్ రానే వచ్చింది. రైతులు మాత్రం ఏ పంట వేయాలనే సందిగ్ధంలో పడిపోతున్నారు. రైతులు ఊరికే గందరగోళానికి గురికావొద్దు. ఏ పంట పండితే ఎంత లాభం వస్తుందనేది రైతులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. మార్కెట్లో దేనికి డిమాండ్ ఉన్నదో ఆ పంటను పండించాలి. ఎదురుచూడకుండా హాట్కేకుల్లా అమ్ముడుపోయే పంటలున్నప్పుడు అలాంటివాటినే అమ్మాలి. ఈ దిశగా రైతులు కొత్తగా ఆలోచించాలి. పత్తి, కంది, వేరుశనగ (బుడ్డలు (మహబూబ్నగర్లో బుడ్డలు అంటారు.)), శనగతోపాటు ఆయిల్ పామ్ పంటలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్నది. ఈ పంట ఉత్పత్తులన్నీ కూడా కండ్ల ముందే, ఎవరికోసం ఎదురు చూడకుండానే, ఎవర్నీ బతిలాడకుండా ఇట్టే అమ్ముడుపోతున్నయి. పైగా ఈ పంటలు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల కంటే.. బహిరంగ మార్కెట్లో అధిక ధరలు పలుకుతున్నాయి. ఈ సీజన్లో మొత్తం 1.40 కోట్ల ఎకరాల్లో వివిధ పంటల సాగు విస్తీర్ణం అంచనావేయగా ఇందులో సుమారు 70% ఈ ఐదు పంటలే ఉండటం గమనార్హం. వీటిలోనూ అత్యధికంగా పత్తి పంటను రికార్డు స్థాయిలో 70,04,547 ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. కంది పంటను 20,00,848 ఎకరాల్లో, పెసర పంటను 1,56,200 ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. రైతులు కూడా ప్రభుత్వ సలహామేరకు పత్తిసాగు దిశగా ముందుకు కదులుతున్నారు.
ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకొని.. ఊరంతా వెతికినట్లు.. అన్న చందంగా తయారైంది వరి సాగు చేసే రైతులు తీరు. కండ్ల ముందు ఎదురుచూడకుండా కొనే పంటలు కనిపిస్తుంటే.. కొనుగోలుకు సాధ్యం కాని వరి పంటనే సాగు చేస్తున్నారు. పైగా ఎవరూ కొంటలేరని రోడ్లు ఎక్కుతున్నారు. అవసరానికి మించి పంటను పండించి కొంటలేరంటూ రొడ్డెక్కితే ఏం ఉపయోగం ఉంటుంది. మార్కెట్లో డిమాండ్ లేనప్పుడు ప్రభుత్వమూ కొనుగోలు చేయజాలదు.. ఎఫ్సీఐ కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పటివరకు ప్రభుత్వం 86 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇది రైతులు తినడానికి మిగుల్చుకోగా అమ్మినది. ఇంకా 4-5 లక్షల టన్నుల ధాన్యం వస్తుంది. అంటే సరాసరిగా 90 లక్షల ధాన్యం వస్తుంది. ప్రతి సీజన్లో ఇంత భారీ మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయాలంటే ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యమయ్యే అంశం కాదు. కాబట్టి రైతులే పునరాలోచించుకోవాలి. పక్క రైతులు వేస్తున్నారనో.. తన యాపారం కోసం విత్తనాల దుకాణపోడు చెప్పిండనో.. మూస పద్ధతిలో పంటల్ని సాగుచేస్తే.. ఆ దిగుబడిని అమ్ముకోవడానికి కనాకష్టం పడాల్సివస్తుంది. అందుకే ప్రభుత్వం సూచిస్తున్నట్టుగా రైతులు ఈ వానకాలం సీజన్లో పత్తి, కంది, వేరుశనగ, శనగ, ఆయిల్పామ్ వంటి సాగుకు ప్రాధాన్యమిచ్చి అధిక విస్తీర్ణంలో సాగుచేస్తే అన్ని విధాలుగా శ్రేయస్కరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పంటలు సాగుచేసే విషయంలో సందేహాలుంటే రైతులు ఆందోళన పడాల్సిన అవసరమే లేకుండా ప్రభుత్వమే ఏర్పాట్లుచేసింది. ఏ నేలలో ఎలాంటి పంటలు వేయాలి? ఏ పంట వేస్తే మార్కెట్లో ఎవరికోసం ఎదురుచూడకుండా దిగుబడిని అమ్ముకోవచ్చు అన్న విషయాలపై సమగ్రంగా వివరించడానికి క్లస్టర్కు ఒకరు చొప్పున వ్యవసాయ అధికారిని నియమించారు. రైతుబంధు సమితులున్నాయి. రైతు వేదికలున్నాయి. రైతులంతా రైతు వేదికల్లో సమావేశమై రైతుబంధు సమితుల కారకర్తలతో, వ్యవసాయాధికారులతో సంప్రదించవచ్చు. లోతుగా చర్చించుకోవచ్చు. సమిష్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకొంటే.. రైతులకు సంతోషం కలుగుతుంది. లాభం దక్కుతుంది.
సాధారణంగా మన వద్ద రైతులు పత్తిని వర్షాధార పంటగా సాగుచేస్తారు. కానీ వాస్తవానికి నీటి పారకం ద్వారా సాగుచేస్తే మరింత ఎక్కువ దిగుబడితోపాటు నాణ్యమైన పత్తి ఉత్పత్తి అవుతుంది. వర్షాధార పద్ధతుల్లో పత్తిని సాగు చేస్తే ఎకరాకు 8-10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. అదే నీటి పారకం ద్వారా సాగుచేస్తే 15-20 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశమున్నది. ఆదిలాబాద్ ప్రాంతంలో కొంత మంది రైతులు ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడితీస్తున్నారు.
రాష్ట్ర రైతులు పత్తి సాగు చేసేందుకు ఇంతకు మించిన అవకాశం ఉండదు. మన రాష్ట్రంలో పత్తి పంటకు అనుకూలమైన మంచి రేగడి భూములున్నాయి. అవసరమైనటువంటి 939 మిల్లీమీటర్ల వర్ష్షపాతమున్నది. మంచి వాతావారణ పరిస్థితులున్నాయి. కష్టించి పనిచేసే రైతులు ఉన్నారు. అందువల్ల పత్తిని సాగు చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అప్పుడే రైతులకు మంచి లాభాలు వస్తాయి. మద్దతు ధర కూడా బాగా రావడం రైతుకు కలిసివచ్చే అంశం. గతం లో పత్తి క్వింటాలుకు రూ.5,825 ఉండగా ఇప్పుడు రూ.200 పెరిగి రూ.6,025కి పెరిగింది. గత సీజన్లోనూ పత్తికి మంచి ధర లభించింది. గరిష్ఠంగా రూ.7 వేల ధర పలకగా చాలా మంది రైతులు రూ.6వేల నుంచి రూ.6,300 వరకు ధర పలికింది. నీటిపారకం ద్వారా ఎకరాకు 15 వేల క్వింటాళ్లు దిగుబడి వస్తుందనుకొంటే.. పెట్టుబడి వ్యయం రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు అవుతుంది. రైతుకు రూ.60 నుంచి రూ70 వేల వరకు లాభం మిగులుతుంది. తెల్ల బంగారం పండిస్తే తెలంగాణ బంగారం అయితది.. రైతు ఇంట బంగారం నిండుతది.
తెలంగాణలో పత్తి సాగుకు మంచి అనుకూలం వాతావరణం ఉండటంతో సీఎం కేసీఆర్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పత్తి సాగు పెంచడానికి ముందే అందుకు అవసరమైన జిన్నింగ్ మిల్లుల పెంపుపై దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రం రావడానికంటే ముందు వంద లోపు జిన్నింగ్ మిల్లులు ఉండేవి. అందులో 50-60 మాత్రమే నడిచేవి. ఇప్పుడు ఆ సంఖ్య 350కి పెరిగింది. దీంతో ఎంత పత్తి పండించినా కొనడానికి అవకాశమున్నది. ఇటు గుజరాత్, తమిళనాడు వ్యాపారులతోపాటు రాష్ట్ర వ్యాపారుల నుంచి కూడా మన పత్తికి డిమాండ్ పెరుగుతున్నది. ఎలాగూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన వంతుగా కొనుగోలు చేస్తూనే ఉంటుంది. కాబట్టి రైతులు అమ్ముకోవడానికి కష్టపడే పంటల్ని సాగు చేయకుండా సులువుగా అమ్ముకునే పత్తి వంటి పంటల్ని సాగుచేస్తే ఎంతో మేలు.
పత్తి సాగులో ప్రధాన సమస్య.. పత్తి ఏరేందుకు కూలీల కొరత. కూలీలంతా వరి నాట్లకు, వరి కోతలకు వెళ్లడంతో పత్తికి కూలీల కొరత ఏర్పడేది. కానీ ఇప్పుడు వరిసాగులో నాటుకు బదులుగా వెదజల్లే పద్ధతి వస్తుండటంతో వరికి కూలీల అవసరం తగ్గుతుంది. దీంతో అనివార్యంగా ఆ కూలీలంతా పత్తివైపు మళ్లుతారు. కాబట్టి పత్తికి కూలీల సమస్య తీరిపోతుంది. పత్తికి కూలీల సమస్యకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. శాస్త్రవేత్తలతో స్వయంగా సమీక్షించి.. పత్తి తెంపే మిషన్లను తయారుచేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనికి అదనంగా పత్తిని రెండు మూడు క్రాప్లు కాకుండా ‘సింగిల్ పిక్’ పత్తి రకాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి కూడా వ్యవసాయ వర్సిటీలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటు మిషన్లు, అటు సింగిల్ పిక్ (ఒకసారి ఏరే) రకంతో పత్తి సాగులో ప్రధాన సమస్యలు తీరనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రొత్సహిస్తున్న పత్తి, కంది, వేరుశనగ, శనగ, ఆయిల్పామ్ పంటలన్నీ కూడా మద్దతు ధర కన్నా ఎక్కువ ధర దక్కేవే కావడం గమనార్హం. వీటిని సాగుచేయడం వల్ల రైతు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోడు. పత్తికి గతేడాది మద్దతు ధర క్వింటాలుకు రూ.5,825 ఉండగా రైతుకు రూ.6 వేల నుంచి రూ.6,300 వరకు ధర పలికింది. కందికి రూ.6 వేలు మద్దతు ధర ఉండగా రైతుకు రూ.6,500 వరకు దక్కింది.వేరుశనగకు రూ.5,275 మద్దతు ధర ఉండగా రైతుకు రూ.5,500 వరకు దక్కింది. శనగలకు కూడా అదే స్థాయిలో ధర దక్కింది. ఇక ఆయిల్పామ్ ధర విపరీతంగా పెరుగుతున్నది. గతంలో రూ.8-9వేలుగా ఉన్న టన్ను గెల ధర ఇప్పుడు ఏకంగా రూ.19 వేలు పలికింది.
జాతీయంగా, అంతర్జాతీయంగా ఆయిల్ సీడ్స్కు భారీ డిమాండ్ ఉన్నది. మన దేశంలో ఏటా రూ.75 వేల కోట్ల విలువైన ఆయిల్పామ్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నాం. అంటే మన దగ్గర ఆయిల్పామ్ సాగుకు ఎంత అవకాశమున్నదో అర్థం చేసుకోవచ్చు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఆయిల్పామ్ సాగును ప్రొత్సహిస్తున్నది. వచ్చే నాలుగేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగయ్యేలా ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నది. అయిల్ పామ్ ధర కూడా మార్కెట్లో భారీగా పెరిగిపోయింది. అందుకే సీఎం కేసీఆర్ కేంద్రం వద్ద పట్టుబట్టి మరీ సత్తుపల్లి వద్ద ప్లాంట్ ఏర్పాటు చేయించారు. దీంతోపాటు నూనె గింజలైన వేరుశనగ సాగు కూడా రైతుకు మంచి లాభాలు తెచ్చి పెడుతున్నది.
పత్తి పంటలందు తెలంగాణ పత్తి వేరయా.. అన్నది ముమ్మాటికీ నిజం. భారతదేశంలో అంతర్జాతీయ నాణ్యత కలిగిన పత్తిని పండించే రాష్ట్రం తెలంగాణే. ఆ తర్వాతి స్థానం విదర్భది. మన పత్తికి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నది. మన దగ్గర పండే పత్తి స్టాపుల్ లెంత్ (పొడవు పింజ) చాలా ఎక్కువ కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉన్నది. దీంతో నాణ్యమైన దారం ఉత్పత్తి అవుతుంది. గుజరాత్, తమిళనాడుల్లో పత్తి పండిస్తున్నప్పటికీ.. ఆ రాష్ర్టాల్లోని జౌళి పరిశ్రమలు మన పత్తినే కొనుగోలుచేస్తాయి. అంతర్జాతీయంగా నాణ్యమైన కాటన్ వస్ర్తాలకు డిమాండ్ ఉండటం వల్ల మనం పండించే పత్తికి ఎలాంటి ఢోకా ఉండదు. ఈ డిమాండ్ భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం రైతులను పత్తివైపు ప్రోత్సహిస్తున్నది. వాస్తవానికి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా ప్రభుత్వం పత్తిసాగుపై, మార్కెటింగ్పై ప్రత్యేక దృష్టిపెట్టింది. 2019లో 54.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా గతేడాది రికార్డు స్థాయిలో ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యానికి మించి 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇక ఈ సీజన్లో మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పత్తిని రికార్డు స్థాయిలో 70.04 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది కన్నా 9.50 లక్షల ఎకరాల్లో అధనంగా సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దేశంలో పత్తి పండించే ప్రధాన రాష్ర్టాలు మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్.. సాధారణంగా పత్తి సాగులో మహారాష్ట్ర, గుజరాత్లు తొలిరెండు స్థానాల్లో ఉంటాయి. కానీ గత ఏడేండ్లలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పత్తి సాగులో గుజరాత్ను దాటేసిన తెలంగాణ.. మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో నిలిచింది. విస్తీర్ణాన్ని శాతంలో పరిగణించినప్పుడు తెలంగాణ తొలిస్థానంలో ఉన్నది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా పత్తి సాగుపై, మార్కెటింగ్పై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి పెట్టింది. 2014లో 41.83 లక్షల ఎకరాల్లో పత్తి సాగయింది. 2019లో 54.45 లక్షల ఎకరాలు, గతేడాది 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 70.04 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
నూనె గింజలు, పప్పు గింజల్లో భాగమైన వేరుశనగ (బుడ్డలు), శనగ పంటలను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రొత్సహిస్తున్నది. ఈ పంటలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నది. ఈ యాసంగిలో వేరుశనగ 2.78 లక్షల ఎకరాల్లో సాగు కాగా.. శనగ 3.53 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ విస్తీర్ణాన్ని రెండింతలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కంది పంట.. రందిలేని పంట. మన దేశం ఏటా లక్షల టన్నుల పప్పు ధాన్యాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీనికితోడు కరోనాతో పప్పులకు డిమాండ్ పెరగటంతో కందికి పంటకు డిమాండ్ పెరిగింది. గత సీజన్లో కందులకు క్వింటాలుకు మద్దతు ధర రూ.6 వేలు ఉండగా మార్కెట్లో రూ.7,200 వరకు పలికింది. సరాసరిగా ప్రతి రైతుకు కనీసంగా రూ.6,300లకు పైగా ధర దక్కడం గమనార్హం. గత సీజన్లో సుమారు 3 లక్షల టన్నుల కందులను ప్రైవేటు వ్యాపారులే కొన్నారంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ డిమాండ్ను గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం కంది సాగుకు ప్రాధాన్యమిచ్చింది. గత సీజన్లో 10.84 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఈసారి కంది సాగు విస్తీర్ణాన్ని ఏకంగా 20 లక్షల ఎకరాలకు పెంచింది.
మన రాష్ట్రంలో మెజార్టీ రైతులు కంది సాగును అంతర పంటగా మాత్రమే సాగుచేస్తున్నారు తప్ప.. పూర్తి స్థాయి పంటగా సాగు చేయడం లేదు. దీంతో అనుకున్న స్థాయిలో పంట దిగుబడి రావడం లేదు. ఒక్క తాండూరు ప్రాంతంలో మాత్రమే కందిని పూర్తిస్థాయి పంటగా సాగుచేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా కందిని పూర్తిస్థాయి పంటగా సాగు చేస్తే ఎంతో మేలు. దీనికి తోడు పత్తి మాదిరిగానే కంది పంటను కూడా వర్షాధార పంటగా సాగుచేస్తున్నారు. కానీ నీటి పారకంతో సాగుచేస్తే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నది. వర్షాధార పంటగా సాగుచేస్తే ఎకరాకు 4-6 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. మంచి రకాలను నీటి పారకం ద్వారా సాగుచేస్తే 10-12 క్వింటాళ్లు వచ్చే అవకాశమున్నది. ఈ పంటలో మరో విశేషం ఏమిటంటే ఇతర పంటలు భూమి నుంచి శక్తిని తీసుకుంటే కంది మాత్రం భూమికే సారాన్ని అందిస్తుంది. ఈ పంటలో చీడపీడలు కూడా తక్కువగా ఉంటాయి. ఆదాయం విషయాన్ని పరిశీలిస్తే ఎకరాకు సరాసరిగా 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా పెట్టుబడి ఖర్చు రూ.15 వేలు పోయినప్పటికీ రైతుకు నికరంగా రూ.20 వేల వరకు మిగులుతాయి.
తెలంగాణ రైతులకు నీళ్లు కనిపిస్తే చాలు మడులు అచ్చుకట్టుడు.. వరి సాగు చేసుడు.. ఇదే అలవాటు. కానీ పరిస్థితులు మారాయి కాబట్టి రైతులు ఆ మూస ధోరణి నుంచి బయట పడాల్సిన అవసరమున్నది. వాస్తవానికి అంతర్జాతీయంగా వరికి డిమాండ్ తగ్గింది. మన దేశంతోపాటు అన్నిదేశాల వద్ద కూడా అవసరానికి మించి ధాన్యం నిల్వలు ఉన్నాయి. దీంతో వరిసాగుకు రోజు రోజుకి ఆదరణ తగ్గిపోతున్నది. ముఖ్యంగా దొడ్డు రకాలకు డిమాండ్ లేకుండా పోతున్నది. గతంలో తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల ప్రజలు దొడ్డు బియ్యం తినేవారు. ఇప్పుడు వారు కూడా సన్నరకం బియ్యానికే మొగ్గు చూపుతున్నారు. ఎఫ్సీఐ కూడా సన్నరకాలే కావాలని అడుగుతున్నది. ప్రజల్లో కూడా సన్నాలను తినాలనే ఆలోచన పెరిగింది. దీన్ని రైతులు దృష్టిలో పెట్టుకోవాలి. వరిసాగును తగ్గించి ప్రత్యామ్నాయ లాభసాటి పంటలపై దృష్టి పెట్టాల్సిన అవసరమున్నది. గత వానకాలం సీజన్లో రికార్డు స్థాయిలో 53.33 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు కాగా ఈసారి 41.85 లక్షలకు పరిమితం చేశారు.
తెలంగాణలో రైతు రాజ్యం కొనసాగుతున్నది. రైతుకు ఇంతకన్నా ఎక్కువ సేవచేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటిలేదు. దీన్ని ఉపయోగించుకొని వ్యవసాయాన్ని స్థిరీకరించుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయానికి నాలుగు రకాల ఇన్పుట్స్ అవసరం అవుతాయి. ఇందులో ప్రధానంగా భూమి, వర్షపాతం. ఈ రెండింటిని దేవుడిస్తాడు. నీళ్లు, భూగర్భ జలాలు, విద్యుత్, పెట్టుబడిసాయం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. మనకు మంచి నేలలున్నాయి. మంచి వర్షపాతమున్నది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పట్టుబట్టి ప్రాజెక్టులను పూర్తి చేసుకొని సమృద్ధిగా సాగునీరును అందుబాటులోకి తెచ్చింది. వీటివల్ల భూగర్భ జలాలు పెరిగాయి. ఈ పెరిగిన భూగర్భ జలాలను ఉపయోగించుకొనేందుకు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందిస్తున్నది. పెట్టుబడికోసం రైతుబంధు సాయం కింద ప్రతి ఏటా ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నది. ఏ రైతు రాజ్యమైనా.. ఏ ప్రభుత్వమైనా.. ఇంతకంటే ఏం చేయగలదు? రైతులు కూడా సృజనాత్మకంగా ఆలోచించాలి. మార్కెట్లో డిమాండ్ గల పంటలనే పండించాలి.
వ్యవసాయిక రాష్ట్రంగా తెలంగాణ ఒక దరికి చేరింది. ప్రభుత్వం కల్సిస్తున్న సౌకర్యాలను చక్కగా వాడుకోవాలి. డిమాండ్ గల పంటలను సాగుచేయడంలో ఒక వ్యూహం రచించుకోవాలి. ఎప్పుడూ పంటల కొనుగోలుకు ప్రభుత్వం వైపు చూసే అలవాటు నుంచి బయటపడాలి. ప్రభుత్వం కూడా అమ్ముడుపోయే దాన్ని కొని మార్కెట్ చేయగలుగుతుందే తప్ప ఎవరూ కొనని పంటను ప్రభుత్వం కొని ఏం చేసుకొంటుంది? ఈ దిశగా రైతులు ఆలోచన చేయాలి. రైతన్న ఆలోచనలో మార్పు వస్తే ఇటు రైతుకు, అటు ప్రభుత్వానికి, మరోవైపు సమాజానికి మేలు జరుగుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరంతినగలిగే బియ్యం 50 కోట్ల టన్నులు
కానీ ఉత్పత్తి అవుతున్నటువంటి బియ్యం68 కోట్ల టన్నులు అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతియేటా18 కోట్ల టన్నుల బియ్యం అధికంగా ఉన్నాయి