నాగర్ కర్నూల్ : రైతులు ఒకే పద్ధతిలో కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా పంట సాగుకు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంట మార్పిడి చేస్తూ అధిక లాభాలు పొందాలని మంత్రి రైతులకు పిలుపునిచ్చారు.
మంగళవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండల క్లస్టర్లు కల్వకోల్, గంట్రావు పల్లి, సాతాపూర్, చిన్నకొత్తపల్లి, పెద్ద కార్పముల, పెద్దకొత్తపల్లి, చంద్రకల్,వెన్నచెర్లలో నిర్మించిన రైతు వేదికలను కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీ పి. రాములు, జడ్పీ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు.
రైతులకు, ప్రజాప్రతినిధుల కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. వానాకాలం పంటను యధావిధిగా కొంటామని యాసంగి నుంచి వరికి బదులు ప్రత్యామ్నాయ పంట వేసుకోవాలని రైతులకు సూచించారు. వానకాలంలో వేసిన పంటను కొనడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సుముఖత చూపించింది కాబట్టి మొత్తం ధాన్యాన్ని కొని మిల్లులకు ఇవ్వడం జరుగుతుంది.
కానీ యాసంగి లో బియ్యం నూకలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని ఎప్సీఐ ఉప్పుడు బియ్యం కొనడానికి సిద్ధంగా లేనందున రైతులు ఇతర ప్రత్యామ్నాయ పంట సాగు వైపు ఆలోచించాలన్నారు. యాసంగి వరి ధాన్యం మాత్రమే వేయాలనుకునే రైతులు ఒక నెల పంటను ముందుకు జరుపుకుని ఫిబ్రవరి, మార్చి వరకు పంట కోతకు వచ్చే విధంగ సన్నద్ధం కావాలన్నారు. అప్పుడు ఎండలు ముదరకముందే పంట కోతకు వస్తే నూకలు తగ్గీ ఉప్పుడు బియ్యం చేయాల్సిన పనిలేకుండా రా రైస్ చేసుకోవచ్చు అన్నారు.
లేదంటే నూనె గింజ పంటలకు మంచి డిమాండ్ ఉందని, నువ్వులు, ఆవాలు, కుసుమలు, వేరు సెనగా, పప్పు సేనగా వంటి పంటలు వేసుకోవాలని రైతులను సూచించారు. ఆయిల్ పామ్ పంట కు సైతం మంచి డిమాండ్ ఉందని అయితే ఈ సంవత్సరం కేవలం 30 వేల ఆయిల్ పామ్ మొక్కలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వచ్చే సంవత్సరం నుంచి మొక్కలు అందించడం, సబ్సిడీ కల్పించడం జరుగుతుందన్నారు.
అంతకుముందు నాయినోని పల్లి మైసమ్మ దేవతా నూతన దేవస్థానాన్ని పరిశీలించి అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మైసమ్మ దేవత దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ రూర్బన్ పథకము కింద రూ. 76 లక్షల వ్యయం తో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంపెక్స్ ను, రూ. 18 లక్షల వ్యయంతో నిర్మించిన దేవాదాయ అతిథి గృహాన్ని మంత్రి ప్రారంభోత్సవం చేశారు.