హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): పంటల నమోదు ప్రక్రియ (క్రాప్ బుకింగ్)ను పక్కాగా నిర్వహించాలని.. ఒక రైతు ఏ పంటను ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనే సమాచారం సేకరించాలని వ్యవసాయశాఖమంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం తన నివాసం నుంచి క్రాప్బుకింగ్పై సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు దేశంలో తొలిసారి రాష్ట్రంలో రెండేండ్లుగా పంటల నమోదును చేపడుతున్నట్టు తెలిపారు. పంటల కొనుగోళ్లు, ఎరువులు, విత్తనాలు తదితర అంశాలన్నీ పంటల నమోదుపైనే ఆధారపడి ఉన్నాయని, అధికారులు సరైన సమాచారం నమోదు చేస్తేనే రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడొచ్చని తెలిపారు. ఏవోలు, ఏఈవోలు క్లస్టర్లవారీగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంటలను నమోదు చేయాలని ఆదేశించారు. కంది, పెసర వంటి అంతర పంటల నమోదులో అధికారులు అలసత్వం వహించవద్దని సూచించారు. కరోనా సమయంలో వ్యవసాయాధికారుల సేవలు మరువలేనివని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నుంచి రైతుబంధు పంపిణీ చేయనున్నామని.. రైతులందరికీ పంటసాయం అందాలని సూచించారు. సమీక్షలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు.
జిన్నింగ్ మిల్లులకు రాయితీలు
రాష్ట్రంలో పత్తిసాగు పెరుగుతున్న నేపథ్యంలో రాయితీలు ఇచ్చి జిన్నింగ్ మిల్లులను ప్రోత్సహిస్తామని నిరంజన్రెడ్డి తెలిపారు. ఇప్పటికే జిన్నింగ్ మిల్లులకు విద్యుత్తు సబ్సిడీ అందజేస్తున్నామని, మరిన్ని రాయితీలు ఇచ్చే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం ఆయన సమీక్షించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు వందలోపే ఉన్న జిన్నింగ్ మిల్లులు..ఇప్పుడు 350కి పెరిగాయని తెలిపారు. పత్తి విత్తనాల నుంచి సేకరించే నూనె, కేక్, సాల్వెంట్ తదితర ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్నదని తెలిపారు. జిన్నింగ్ మిల్లులను ప్రోత్సహించేందుకు కాటన్ సాల్వెంట్ పాలసీని పరిశీలిస్తున్నదని చెప్పారు.