సిఫార్సుల కన్నా పీఆర్సీ ఎక్కువే

- భారీ మొత్తంలో పెంచింది కేసీఆర్ సర్కారే
- 1958 నుంచి 11 వేతన సంఘాలు
- ఉద్యోగులను నిరాశపరచని ప్రభుత్వాలు
ప్రత్యేక ప్రతినిధి, జనవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వేతన సంఘాలు చేసిన సిఫార్సుల విషయంలో ప్రభుత్వాలు ఎన్న డూ ఉద్యోగులను నిరాశపరచలేదు. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు రెండు పర్యాయాల నుంచి వేతన కమిషన్ సిఫార్సు కంటే అధికంగా పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాలు వేతన కమిషన్ సిఫార్సులను యథాతథంగా అమలుచేశాయి. ఇప్పటికి పది పీఆర్సీలు అమలుకాగా, తెలంగాణ ఏర్పడిన తరువాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ చైర్మన్గా మొదటి వేతన కమిషన్ ఏర్పాటైంది. 2018 మేలో ఏర్పాటైన ఈ కమిషన్ చేసిన సిఫార్సులు 31 డిసెంబర్ 2020న రాష్ట్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో 1958లో మొదటి కమిషన్ అప్పటి ఆర్థికశాఖ మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో ఏర్పాటైంది. స్వాతంత్య్రానంతరం ఇప్పటివరకు కేంద్రం ఏడు పీఆర్సీలను నియమించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేండ్లకు ఒకసారి కమిషన్ను ఏర్పాటుచేస్తుండగా రాష్ట్రంలో ఐదేండ్లకు ఒకసారి వేతన సంఘాలను ఏర్పాటుచేసే సంప్రదాయం కొనసాగుతున్నది. పీఆర్సీలు చేసే సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని ఆయా పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. తెలంగాణ ఆవిర్భావానికి ఏడాది ముందు ప్రదీప్కుమార్ నేతృత్వంలోని పదో వేతన సంఘం 29 శాతం ఫిట్మెంట్ను సిఫార్సు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ సిఫార్సులను టీఆర్ఎస్ ప్రభు త్వం పరిగణనలోకి తీసుకున్నది. సీఎం కేసీఆర్ 43శాతం ఫిట్మెంట్ను అమలు చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయం 2జూన్ 2014 నుంచి అ మలులోకి వచ్చింది. దీంతో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు పీఆర్సీ చేసిన సిఫార్సు కంటే భారీ మొత్తంలో ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ సర్కార్కు దక్కింది.