శామీర్పేట, జూన్ 22 : సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని, పల్లె ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములై గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. శామీర్పేట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం హరితహారం, సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్యార్డులు, మిషన్ భగీరథ, తదితర పథకాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వానకాలం సమీపిస్తున్నందున నర్సరీల్లో, రోడ్డుకు ఇరువైపులా నాటే మొక్కలు, పండ్ల మొక్కలను ఒక్కో ఇంటికి 6 పంపిణీ చేయాలన్నారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి ఇంటికి 6 పెంచిన వారిని గుర్తించి వారికి ప్రోత్సాహకాలను అందజేయాలన్నారు. కార్యక్రమంలో సీఈవో దేవసహాయం, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, జడ్పీటీసీ అనితాలాలయ్య, అడిషనల్ డీఎంహెచ్వో నారాయణ, ఎఫ్ఆర్వో అరుణ, ఎంపీడీవో వాణీగురుదాస్, వైద్యాధికారి మనుపప్పన్, సర్పంచ్ బాలమణి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.