హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ( CPGET – 2021 ) ఫలితాలు ఈ నెల 21న విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ కలిసి రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్లో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం http://tscpget.com/CPGET వెబ్సైట్ను సంప్రదించొచ్చు.
ఈ ఏడాది సెప్టెంబర్ 18, 21 నుంచి 27, అక్టోబర్ 4 నుంచి 5వ తేదీల మధ్యలో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, జేఎన్టీయూ వర్సిటీలతో పాటు వాటి అనుబంధ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 78,312 మంది దరఖాస్తు చేసుకోగా, 68,836 మంది ఎగ్జామ్స్ రాశారు.