హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): లైఫ్ సైన్సెస్, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ, బిజినెస్ ఫ్రెండ్లీ విధానాలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని అమెరికా కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్మన్ చెప్పారు. తన స్నేహితుడు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు, తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి ప్రశంసనీయం అన్నా రు. అమెరికా 245వ స్వాతంత్య్ర వేడుకలను ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) మంగళవారం రాత్రి జూమ్లో నిర్వహించిం ది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రీఫ్మన్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యానికి ఈ వేడుకలే నిదర్శనమని చెప్పారు. రక్షణ, ప్రాంతీయ సహకారం, ఉగ్రవాదం, శాంతి పరిరక్షణ, వాతావరణ మార్పు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయం, అంతరిక్షం, వాణిజ్యం, విద్యలో పరస్పర సహకారం ఉందని తెలిపారు. దాదాపు 40 లక్షల మంది భారతీయ అమెరికన్లు అమెరికాను తమ ఇంటిగా భావించి, అనేక రంగాల్లో దేశానికి తోడ్పాటును అందిస్తున్నారని చెప్పారు. నాసా అంతరిక్ష మిషన్ కమాండర్ తెలంగాణ మూలాలు కలిగిన వ్యక్తి అని గుర్తుచేశారు. వచ్చే అక్టోబర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపబోయే స్పేస్ఎక్స్ మిషన్కు తెలుగువాడైన రాజాచారి కమాండర్ అని, ఆయన తండ్రి శ్రీనివాస్చారి హైదరాబాద్కు చెందినవారని తెలిపారు.
ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ కీలక ప్రాత
కొవిడ్ -19 లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత ఆరోగ్య రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషించిందని జోయెల్ రీఫ్మన్ అన్నారు. అమెరికాతో భారత్ నిలిచినట్టే.. మహమ్మారితో పోరాడినప్పుడు భారత్తో అమెరికా కలిసి నిలిచిందని చెప్పారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం బలంగా ఉందని అన్నారు. ఐఏసీసీ జాతీయ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు సూరపనేని మాట్లాడుతూ.. భారత్, అమెరికా అన్ని విధాలుగా నిజమైన స్నేహితులు అన్నారు. కొన్నేండ్ల్లుగా ఇరు దేశాలు రాజకీయ, ఆర్థిక సంబంధాలను పెంచుకోడానికి గణనీయమైన చర్యలు తీసుకున్నాయని చెప్పారు. రెండు దేశాల మధ్య 500 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని సాధించేందుకు ఐఏసీసీ కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఐఏసీసీ ఏపీ, టీఎస్ చైర్మన్ విజయ్సాయి మేకా పాల్గొన్నారు.