హైదరాబాద్ : దేవాలయాల్లో అర్చకత్వం నిర్వహించే అర్చకులకు, హిందూ సాంప్రదాయముల ప్రకారం పురోహితం చేసే పురోహితులకు ప్రభుత్వం వెంటనే కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ధూప, దీప, నైవేద్య అర్చక సంఘం రాష్ర్ట అధ్యక్షులు డి. వాసుదేవ శర్మ విజ్ఞప్తి చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా శుభముహుర్తము, వివాహాలు, కార్యక్రమాలు జరిపించే ప్రక్రియలో చాలా మంది ప్రజలతో కలవవస్తున్నది. కరోనా భయంతో అంత్యక్రియలు నిర్వహించడం చాలా కష్టంగా ఉన్నది. అనేక మంది అర్చకులు, పురోహితులు 45 సంవత్సరాల లోపు ఉన్నారు. చాలా మంది అర్చక, పురోహిత కుటుంబాలు కరోనా బారిన పడి అకాల మరణం పొందారు. కావున ప్రభుత్వం మానవతాదృక్పథంతో సూపర్ స్ప్రెడర్ల కోటాలో అర్చక, పురోహితులకు టీకాలు వేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని వాసుదేవ శర్మ ప్రభుత్వానికి విన్నవించారు.