హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి కోరలు చాచినప్పటికీ, ఉన్నచోటే మెరుగైన చికిత్స అందించేందుకు మేమున్నామంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు భరోసా ఇస్తున్నారు. కరోనా బాధితులు హైదరాబాద్కు వెళ్లాల్సిన పనిలేకుండా జిల్లా, నియోజకవర్గాల స్థాయిలోనే క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటుచేయిస్తున్నారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇప్పటికే మంత్రులు ఏర్పాట్లుచేశారు. మంగళవారం మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేటలో కొవిడ్ దవాఖానను ప్రారంభిస్తున్నారు. ఆర్మూర్లో ఆక్సిజన్ సౌకర్యంతో 100 పడకల కొవిడ్ కేర్ సెంటర్ను పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. 51 మంది సిబ్బందిని నియమించి రెండు అంబులెన్స్ను సిద్ధంగా ఉంచారు. బోధన్ ఏరియా దవాఖానలో 80 పడకలతో కొవిడ్ వార్డు ఏర్పాటుచేసి 50 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు.