హైదరాబాద్ : కరోనా రోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ట ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కరోనా చికిత్స ఛార్జీలపై వైద్యారోగ్య శాఖ జీవో 40 జారీ చేసింది.
సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ. 4 వేలు, ఐసీయూ వార్డులో రోజుకు గరిష్టంగా రూ. 7,500 వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. వెంటిలేటర్తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్టంగా రూ. 9 వేలుగా ఖరారు చేశారు. పీపీఈ కిట్ ధర రూ. 273కు మించరాదని తెలిపింది. హెచ్ఆర్సీటీ – రూ. 1995, డిజిటల్ ఎక్స్రే – రూ. 1300, ఐఎల్6 – రూ. 1300, డీ డైమర్ పరీక్ష – రూ. 300, సీఆర్పీ – రూ. 500, ప్రొకాల్ సీతోసిన్ – రూ. 1400, ఫెరిటిన్ – రూ. 400, ఎల్ డీహెచ్ – రూ. 140గా ఖరారు చేశారు. సాధారణ అంబులెన్స్కు కనీస ఛార్జి రూ. 2 వేలు, కిలోమీటర్కు రూ. 75, ఆక్సిజన్ అంబులెన్స్కు కనీస ఛార్జి రూ. 3 వేలు, కిలోమీటర్కు రూ. 125గా ఖరారు చేశారు.