రాష్ట్రంలో ఇప్పటికే నిర్వహించిన జ్వరసర్వేతో కరోనాను ముందస్తుగా కట్టడిచేయడంలో సఫలీకృతమయ్యాం. జ్వరసర్వే దేశానికే ఆదర్శంగా నిలిచింది. కరోనా మరో వేవ్ రానున్నదన్న వార్తల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉండాలి.
–సమీక్షలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమేసేందుకు మరోసారి జ్వరసర్వే నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. గతంలో నిర్వహించిన జ్వరసర్వేతో వైరస్ను ముందుగానే కట్టడి చేయగలిగామని, ఇప్పటికీ వైరస్ ప్రభావం ఉన్న కొద్దిపాటి ప్రాంతాల్లో మరోసారి సర్వే నిర్వహించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వైద్యారోగ్య పరిస్థితులపై ప్రగతిభవన్లో శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మన సరిహద్దు రాష్ర్టాల్లో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాలేదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో కరోనా ప్రమాదం పొంచే ఉన్నదని తెలిపారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి శాస్త్రీయ అధ్యయనం చేసి, కరోనా విస్తరణకు గల కారణాలను లోతుగా పరిశీలించాలని సూచించారు. ఇందుకోసం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం 11, 12, 13 తేదీల్లో కరోనా ప్రభావిత సరిహద్దు జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటించాలని ఆదేశించారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరిఖని, సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి నివేదికను క్యాబినెట్కు సమర్పించాలని సూచించారు. కరోనా నియంత్రణకోసం చేపట్టాల్సిన చర్యలను, ముందస్తు నివారణ కార్యక్రమాలను ప్రత్యేకంగా రూపొందించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, డీపీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎంహెచ్ వోలు, దవాఖానల సూపరింటెండెంట్లు, స్థానిక అధికారులను సమావేశపరిచి అప్రమత్తం చేయాలన్నారు.
xప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి ఇప్పటికీ సరైన కారణాలను ఎవరూ గుర్తించలేకపోతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా అంతుచిక్కని సమస్యగా మారిందని, దాన్ని కట్టడి చేయటంపై ప్రభుత్వాలకు సంపూర్ణ అవగాహన కరువైందని పేర్కొన్నారు. ‘ఏ వేరియంట్, ఏ వేవ్, ఎప్పడొస్తదో ఎందుకు వస్తదో ఎంతవరకు విస్తరిస్తదో తెలుస్తలేదు. ఏ రోగానికైనా దాని కారణం దొరికితే నివారణకు మార్గం సుగమం అయితది. కరోనా రోగ కారణం, దాని లక్షణం మొత్తంగా కరోనా స్వరూపం, పర్యవసానాలు అర్థం కాని పరిస్థితి ఉన్నది. కరోనా నియంత్రణ చాలా సంక్లిష్టంగా మారింది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలి. కరోనా నియంత్రణకు నూతన మార్గాలను అనుసరించాలె. కొత్త వేరియంట్ల పేరుతో వేవ్ల రూపంలో దశలవారీగా వస్తున్న కరోనా నియంత్రణకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రజలను కరోనా బారినుంచి రక్షించుకునే చర్యలను చేపట్టాలి’ అని సీఎం స్పష్టంచేశారు.
ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ తదితర రాష్ర్టాల్లో కరోనా స్థితిగతులు, నియంత్రణ చర్యలను అధికారులు అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ‘కరోనా నియంత్రణ కోసం చేయదగ్గ పనేమిటో గుర్తించడంలో వైద్యశాఖ అధికారులు కసరత్తు చేయాలి. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలి. ప్రజలు కూడా కరోనా కట్టడికోసం ప్రభుత్వంతో కలిసిరావాలి. స్వీయ నియంత్రణతో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పారిశుద్ధ్యపరిస్థితుల్లో గుణాత్మక మార్పులు వస్తున్నాయి. తద్వారా కూడా కరోనాను కట్టడి చేయగలిగాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శి, కరోనా నియంత్రణ ప్రత్యేకాధికారి రాజశేఖర్రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, సీఎం ఓఎస్డీ తాడూరి గంగాధర్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ కట్టా చంద్రశేఖర్రెడ్డి, వైద్యవిద్య సంచాలకుడు కే రమేశ్రెడ్డి, హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీసీ బీ కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పట్టణాన్ని హెల్త్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుకు సంబంధించిన చర్యల గురించి సమావేశంలో సీఎం ఆరా తీశారు. నూతన దవాఖానను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడం ద్వారా తూర్పు తెలంగాణ మొత్తం వైద్యసేవలకోసం వరంగల్లుకు తరలివెళ్లేలా చూడాలన్నారు. అన్ని విభాగాలతో సమీకృత భవన సముదాయంగా నూతన దవాఖాన నిర్మాణం ఉండాలని సీఎం అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా నియంత్రణలో వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పనితీరు ఎట్ల ఉన్నది ? మందులు, ఇంజెక్షన్ల లభ్యత సక్రమంగా ఉన్నదా? సకాలంలో సరఫరా అవుతున్నాయా ? బెడ్లు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయా? అనే అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే నిర్వహించిన జ్వరసర్వేతో కరోనాను ముందస్తుగా కట్టడిచేయడంలో సఫలీకృతమయ్యామన్నారు. జ్వరసర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కరోనా మరో వేవ్ రానున్నదన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.