హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతితో నగరాలు అభివృద్ధి చెందుతున్నాయని, రూపురేఖలు మారిపోతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ పద్దులపై ఎమ్మెల్యే గుప్తా మాట్లాడారు. ప్రపంచంలో చాలా దేశాలు పట్టణీకరణ వైపు వెళ్తున్నాయి. రాష్ర్టంలో 40 శాతం పైచిలుకు జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు అని పేర్కొన్నారు. అతి త్వరలోనే పట్టణీకరణ జనాభా 50 శాతం చేరుతుందని అంచనా వేస్తున్నారు. కేవలం హైదరాబాద్ సిటీలో 30 శాతం నివసిస్తున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం జనాలు అర్బన్ ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
ప్రజలు అర్బన్ వైపు మొగ్గు చూపకుండా.. గ్రామాల్లోనే అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అర్బన్ ప్రజలు కరెంట్, డ్రైనేజీ సిస్టంతో పాటు ఆరోగ్య సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీని కోరుకుంటారు. వీటి కోసం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేశారని తెలిపారు. సిటీలో డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థను డెవలప్ చేస్తున్నారని స్పష్టం చేశారు. తాగునీటి కోసం కృష్ణా, గోదావరి నుంచి నీళ్లు తీసుకువస్తున్నారు. నాగార్జున సాగర్ వద్ద ఉన్న సుంకిశాల రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్కు తాగునీటిని తెచ్చేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేశారని పేర్కొన్నారు.
రోడ్ నెట్వర్క్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అండర్పాస్లు, ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేస్తున్నారు. హైటెక్ సిటీ మాదిరిగానే మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి హైదరాబాద్కు కొత్త అందాన్ని తీసుకొచ్చామన్నారు.
హైదరాబాద్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం కర్ఫ్యూ, గుండాయిజం, రౌడీయిజం లేదు. త్వరలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు. మహిళల రక్షణ కోసం షీటీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్కు ఇరువైపులా సుందరీకరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర నగరాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మిగతా నగరాల్లోనూ పట్టణ ప్రగతి ద్వారా అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. ప్రతి మున్సిపాలిటీకి క్రమం తప్పకుండా నిధులు మంజూరు చేసి అభివృద్ధికి అందలం వేస్తున్నారని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పేర్కొన్నారు.