బంజారాహిల్స్ : ప్రేమపేరుతో వివాహితను వెంటపడి వేధించడంతో పాటు ఆమె కదలికలపై నిఘాపెట్టి బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తితో పాటు అతడికి సహకరించిన వ్యక్తులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.1లో నివాసం ఉంటున్న వివాహిత(36) ఓ స్లిమ్మింగ్ కాస్మెటిక్ సంస్థలో రీజనల్ మెడికల్ హెడ్గా పనిచేస్తున్నారు. కొంతకాలం క్రితం వరప్రసాద్ అనే క్లయింట్ వెంటవచ్చిన విశ్వనాథ్ ఆమె నంబర్ తీసుకుని తరుచూ ఫోన్లు చేయడం ప్రారంభించాడు. దీంతో ఆమె నంబర్ను మార్చేసింది. అయినప్పటికీ హెయిర్ట్రీట్మెంట్ పేరుతో విశ్వనాథ్ ఆమె పనిచేస్తున్న క్లినిక్కు వస్తూ అక్కడ పనిచేస్తున్న వారితో స్నేహం చేయడంతో పాటు ఆమె కుటుంబం వివరాలు సేకరించడం ప్రారంభించాడు. కాగా అక్కడ ఉద్యోగం మానేసి వేరేసంస్థలో చేరింది. అయితే ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో నాగరాజు అనే వ్యక్తి పేరుతో ఫ్లాట్ అద్దెకు తీసుకున్న విశ్వనాథ్ అక్కడే ఉంటూ తిరిగి వేధించాడు. అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఆమె ఇంట్లో లేనిసమయంలో కొడుకుకు చాక్లెట్లు, బొమ్మలు ఇస్తూ స్నేహం చేసిన విశ్వనాథ్ అతడిని తనతో పాటు ఫ్లాట్కు తీసుకువెళ్లి తండ్రి గురించి చెడుగా చెప్పడం ప్రారంభించాడు.
అంతేకాకుండా ఆమె కారులో రహస్యంగా జీపీఎస్ పరికరాన్ని పెట్టి కదలికలపై నిఘా పెట్టాడు. తన గురించి ఎవరికైనా చెబితే కొడుకుతో పాటు భర్తను కూడా అంతం చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశాడు. ఇదిలా ఉండగా ఇటీవల భర్త ఈ విషయాన్ని గురించి తెలుసుకుని విశ్వనాథ్కు కాల్ చేయడంతో పారిపోయాడు. కారులో తనిఖీ చేయగా జీపీఎస్ పరికరం బయటపడింది. దీంతో విశ్వనాథ్ ఫ్లాట్ ఖాళీచేసేందుకు యత్నించగా ఆమె భర్త అడ్డుకున్నాడు. ఈ వ్యవహారంలో నిజాలు తెలిసిన తర్వాతనే ఇంటిని ఖాళీ చేయాలని చెప్పాడు. దీంతో విశ్వనాథ్ బంధువు సురేశ్తో పాటు పులి శ్రీకాంత్ పటేల్ అనే ఓ నాయకుడి సహాయంతో రాజీ కుదుర్చుకుందామంటూ రాయబారాలు ప్రారంభించాడు. ఈ మొత్తం వ్యవహారంలో తనకు ప్రాణహాని ఉందని, తనతో అసభ్యకరమైన రీతిలో ప్రయత్నించడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న విశ్వనాథ్తో పాటు అతడికి సహకరిస్తున్న సురేశ్, పులి శ్రీకాంత్ పటేల్, నాగరాజు తదితరులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు సోమవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.