న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న కొవిడ్ సంబంధిత నిబంధనలను వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు పొడగించింది. మహమ్మారి వ్యాప్తి నివారణకు తప్పనిసరిగా దేశాలను పాటించాలని ఆదేశించింది.
ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని సీఎస్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరింత ముందుచూపు, డేటా విశ్లేషణతో పాటు స్థానిక, జిల్లాస్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించింది. పండుగల సీజన్లో రద్దీని నియంత్రించేందుకు రాష్ట్రాలు అవసరానికి అనుగుణంగా నిబంధనలను విధించవచ్చని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఒకే రోజు భారీగా ఒమిక్రాన్ కేసులు పెరగడంతో మంత్రిత్వశాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటి వరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 578 కేసులు నమోదయ్యాయి. ఇందులో 151 మంది కోలుకున్నారు. అత్యధికంగా ఢిల్లీలో 142, మహారాష్ట్రలో 141, గుజరాత్లో 49, రాజస్థాన్లో 43, తెలంగాణలో 41 కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశంలో 6,531 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.