నేలతల్లికి పసుపు,కుంకుమ పెట్టి.. కొబ్బరికాయ కొట్టి..
బసవన్నలను అలంకరించి.. అరకపట్టి దుక్కిదున్ని..
పచ్చడి చేసి.. ఇష్టదైవాలకు నైవేద్యం సమర్పించి..
పంటలు పండాలని.. సుఖశాంతులతో ఉండాలని..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైభవంగా ఉగాది వేడుకలు
‘సాగువాటు నాడు సాగకపోతే.. సాలంతా ఆగిపోతది’ అనేది సామెత.. సాగువాటు అంటే రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టే రోజు. ఆ రోజే ఉగాది. తెలుగు నూతన సంవత్సరం నాడు వ్యవసాయ పనులు మొదలు పెడితే పంటలు బాగా పండుతాయనేది ప్రజల నమ్మకం. దీంతో మంగళవారం ప్లవ నామ సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రజలు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. బసవన్నలను అలంకరించారు. ఇంటిల్లిపాది తమ చేల వద్దకు వెళ్లి నేలతల్లికి పూజలు చేసి అరకపట్టి దున్నారు. అలాగే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు ఉగాది వేడుకలను కనులపండువలా జరుపుకున్నారు.
శ్రీ ప్లవ నామ సంవత్సర.. ఉగాది వేడుకలను పురస్కరించుకొని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రైతులు.. వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. నూతన ఏడాది సందర్భంగా నేలతల్లికి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. ముందుగా వేకువజామునే తమ ఎడ్లను సమీప చెరువులు, వ్యవసాయ బావుల వద్దకు తీసుకెళ్లి శుభ్రంగా కడిగారు. వాటిని పూలతో అలంకరించారు. అనంతరం కుటుంబ సమేతంగా ఎడ్ల బండ్లపై పొలాలకు వెళ్లారు. అక్కడే పిండి వంటలు, నవధాన్యాలతో గుడాలు తయారు చేసి.. భూ దేవికి, ఎడ్లకు నైవేద్యం సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. పంటలు బాగా పండాలని, సుఖసంతోషాలతో మెలగాలని వేడుకున్నారు. ఆ తర్వాత వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఆదిలాబాద్ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.. కుటుంబ సమేతంగా పూజలు చేశారు. అరకపట్టి పనులు ప్రారంభించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో వైదిక బృందం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.