హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో కూడా జిల్లా కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టు న్యాయమూర్తుల సబ్ కమిటీ చర్చించిందని, అందుబాటులో ఉన్న భవనాలు, ఇతర మౌలిక వసతులు, కేసుల సంఖ్య ను పరిగణనలోకి తీసుకొని, ప్రతి జిల్లాలోనూ జిల్లా కోర్టు ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. పెరిగిన హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ ప్రక్రియను ప్రారంభించామని, కొంతమంది పేర్లను సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసినట్టు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భం గా ఆదివారం హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సీజే మాట్లాడారు. కోర్టుల్లోని సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారుల కమిటీతో చర్చలు ఫలప్రదమయ్యాయని వె ల్లడించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 46 కోర్టులు, 2,170 మంది అదనపు సిబ్బందిని మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ టీ సూర్యకరణ్రెడ్డి, బార్ అసోసియేషన్ చైర్మన్ పొన్నం అశోక్గౌడ్ పాల్గొన్నారు.
హైకోర్టు బార్ అసోసియేషన్ ఆర్థిక సాయం
కరోనా బాధిత న్యాయవాదుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున హైకోర్టు బార్ అసోసియేషన్ ఆర్థిక సాయం అందజేసింది. ఆయా కుటుంబాలకు చెక్కులను సీజే అందజేశారు. తన భార్య నారపరాజు సావిత్రి జ్ఞాపకార్థం తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మె ల్సీ రామచంద్రరావు హైకోర్టుకు అందజేసిన అంబులెన్స్ను చీఫ్ జస్టిస్ ప్రారంభించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు మాజీ న్యాయమూర్తులు పాల్గొన్నారు.