హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): డిగ్రీ, ఇంజినీరింగ్, వృత్తివిద్యా కోర్సుల రూపకల్పన విధానం క్రమంగా మారుతున్నది. కోర్సులను రూపొందించే జాతీయ సంస్థలు, విద్యాసంస్థలకు బదులుగా ఆయా రంగం, పారిశ్రామిక వర్గాలే తమకు అవసరమైన కోర్సు రూపొందించి విద్యాసంస్థలకు అందిస్తున్నాయి. ఇటీవల చాలా సంస్థలు ఇదే ధోరణి అనుసరిస్తున్నాయి.
కోర్సులు, కరిక్యులం..
మనదేశంలో ఇప్పటివరకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సులు రూపొందడంలేదు. కాలేజీ పాఠాలకు, ఉద్యోగం వచ్చిన తర్వాత చేసే పనికి పొంతన ఉండటం లేదు. పరిశ్రమ అవసరాలు విద్యాసంస్థలకు తెలియకపోవడంతో విద్యార్థులు నేర్చుకున్నవి వృత్తిజీవితంలో ఉపయోగపడటంలేదు. ఈ నేపథ్యంలో తమకు కావాల్సిన కోర్సులు, కరిక్యులంను ఆయా రంగాల్లోని సంస్థలే రూపొందిస్తున్నాయి. డీఆర్డీవో, టీసీఎస్ లాంటి దిగ్గజ సంస్థలు ఇదే బాటలో పయనిస్తూ వర్సిటీలతో ఒప్పందాలు చేసుకొంటున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేయగానే నేరుగా ప్లేస్మెంట్స్ లభిస్తుండటంతో విద్యార్థులు వాటిల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.