హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): డిగ్రీ విద్యార్థులు తమకు నచ్చినరీతిలో చదువుకొనేలా రూపొందించిన క్లస్టర్ విధానం అమలులో భాగంగా ఉన్నత విద్యామండలి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతలో బీఏ హానర్స్ కోర్సును క్లస్టర్ విధానంలో నిర్వహించనున్నారు. 2021-22 విద్యాసంవత్సరానికి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కోఠి మహిళా కళాశాల, నిజాం కాలేజీల్లో ఈ కోర్సును నిర్వహించనున్నారు. మంగళవారం ఈ కోర్సును రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కోఠి మహిళా కళాశాలలో ప్రారంభించనున్నారు. క్లస్టర్ విధానం మార్గదర్శకాలను సైతం విడుదల చేయనున్నారు. ఒక క్లస్టర్ పరిధిలో మూడు కాలేజీల చొప్పున ఉంటాయి. ఒక కాలేజీలో చేరినవారు మరో కాలేజీలో క్లాసులు వినే అవకాశం ఇస్తారు. క్లస్టర్ విధానాన్ని డిగ్రీ కాలేజీల్లో అమలు చేయగా, తాజాగా వర్సిటీలను సైతం అనుసంధానించాలని నిర్ణయించారు.
ఇలా ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది, మరో యూనివర్సిటీలో క్లాసులు వినేందుకు అవకాశానివ్వనున్నారు. ఆయా కోర్సులకు సంబంధించిన క్రెడిట్లను అడ్మిషన్ పొందిన వర్సిటీకి బదలాయిస్తారు. విద్యార్థి ఆసక్తి ఉన్న కోర్సు నిర్వహించని పక్షంలో మాస్సీవ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్) ద్వారా కోర్సులను ఆన్లైన్లో అభ్యసించే అవకాశానివ్వనున్నారు. క్లస్టర్ కాలేజీల మధ్య సమస్యలు తలెత్తకుండా ఆయా విద్యాసంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు చేయనున్నారు.