హైదరాబాద్ : మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి సంబంధించిన రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎలిమినేషన్ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు కలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 3,930 ఎలిమినేషన్ ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాంచందర్రావుకు 1,919, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్రావుకు 2,477, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 2,044 ఎలిమినేషన్ ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థిపై వాణీదేవి 10,035 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు వాణీదేవికి 1,16,619 ఓట్లు, రాంచందర్రావుకు 1,06,584, ప్రొఫెసర్ నాగేశ్వర్రావుకు 56,087, చిన్నారెడ్డికి 33,598 ఓట్లు లభించాయి. ఇక్కడ అభ్యర్థి విజయానికి 1,68,520 ఓట్లు అవసరం.