హైదరాబాద్ : సంగారెడ్డి, ఆందోళ్, నారాయణ ఖేడ్, జహీరాబాద్లకు సాగు నీరందించేందుకు ప్రతిపాదించిన సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టుల డీపీఆర్కు వెంటనే అంచనాలు పంపాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. రెండు నెలల్లో సర్వే పూర్తి చేసి ఈ పనులకు టెండర్లు పిలవాలన్నారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో సంగారెడ్డి, మెదక్ నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి హరీశ్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రెండు లిఫ్ట్ ల ద్వారా 3 లక్షల 45 వేల ఎకరాలకు నీరు అందుతుందని ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు. ఈ లిఫ్ట్ ల ద్వారా ఏయే మండలాలకు, ఎంత మేర నీరందిస్తున్నారన్న విషయాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కొమరవెళ్లి మల్లన్న సాగర్ నుండి కాలువల ద్వారా సింగూరు ప్రాజెక్టుకు వచ్చే నీటిని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ ఖేడ్ నియోజవర్గాలకు అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ లిఫ్ట్ లకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ లిఫ్ట్ ద్వారా ఆందోళ్ నియోజకవర్గానికి 50 వేల ఎకరాలకు నీరు అందుతుందని మంత్రి చెప్పారు. జహీరాబాద్, నారాయణ్ ఖేడ్. సంగారెడ్డి నియోజవర్గాలకు తప్పకుండా నీరందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ లిఫ్ట్ల అంశం తన బడ్జెట్ ప్రసంగంలోను పొందుపరచమని చెప్పారన్నారు. సీఎం సూచనల మేరకు పకడ్బందిగా ఎక్కువ ఆయకట్టుకు నీరు అందేలా చూడాలన్నారు. సంగారెడ్డి జిల్లా సర్కిల్ పరిధిలోని ప్యాకేజి 17, ప్యాకేజి 18, ప్యాకేజీ 19 కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును మంత్రి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. వేగంగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్దంగా పని చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, క్రాంతికిరణ్, గూడెం మహిపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్, భూపాల్ రెడ్డి, సంగారెడ్డి సీఈ వి. అజయ్ కుమార్, సంగారెడ్డి ఎస్ఈ మురళీధర్, సంగారెడ్డి ఈఈ మధుసూదన్ రెడ్డి, నర్సాపూర్ ఈఈ కనగేశ్ పాల్గొన్నారు.