కాశీబుగ్గ: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర సోమవారం రికార్డు స్థాయిలో పలికింది. ఈ సీజన్ అక్టోబర్ నుంచి ఇప్పటివరకు వచ్చిన పత్తికి క్వింటాల్కు రూ.7వేలు ధర పలికింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతుల దగ్గరి పత్తి పూర్తిస్థాయిలో అమ్ముకున్న తర్వాత ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని చెబుతున్నారు. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం గ్రామానికి చెందిన టి.పోశయ్య అనే రైతు 26 బస్తాల పత్తిని తీసుకువచ్చాడు. వంశీకృష్ణ ఎంటర్ ప్రైజెస్ అడ్తి ద్వారా సిరివెల్లి ఎంటర్ప్రైజెస్ అనే ఖరీదు వ్యాపారి క్వింటాల్కు రూ.7వేలకు కొనుగోలు చేశాడు. ఈ సీజన్లో అక్టోబర్ నుంచి అత్యధికంగా ధర పలికినట్లు మార్కెట్ చైర్మన్ చింతం సదానందం తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత రైతుతో చైర్మన్ సదానందం మాట్లాడి నాణ్యత ఉన్న సరుకు తీసుకువస్తే గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు.