హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా ప్రత్యేక డిమాండ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పత్తి సాగును మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖను క్యాబినెట్ ఆదేశించింది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండుతున్నాయి. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో సాగునీటి లభ్యత, రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచటం తదితరాలపై క్యాబినెట్ చర్చించింది. ముఖ్యం గా వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతాలను గుర్తించి, లాభసాటి పంటల సాగును మరింత ప్రోత్సహించే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నది.
ఆదాయంలో 20% వ్యవసాయంపైనే
‘మిషన్ కాకతీయ అమలు ద్వారా చెరువుల కింద సాగు పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తై అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చింది. కరెంటు సరఫరాలో వచ్చిన గుణాత్మక మార్పు వల్ల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఈరోజు రాష్ట్ర ఆదాయంలో 20% ఆదాయం వ్యవసాయరంగం నుంచే వస్తున్నది. ఇది తెలంగాణ చరిత్రలో మేలిమి మలుపు’ అని సీఎం పేరొన్నారు.
వృత్తిపనుల వారి జీవితాలను నిలబెట్టాం
గ్రామాల్లో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తున్నదని, పల్లెప్రగతి వల్ల మౌలిక వసతుల కల్పన జరిగి, గ్రామీణ జీవితం ఆహ్లాదంగా మారిందని సీఎం చెప్పారు. ఇందుకు పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభినందనీయులని అన్నారు. సమైక్య రాష్ట్రంలో విచ్ఛిన్నమైన వృత్తి పనులవారి జీవితాలను నిలబెట్టే ప్రయత్నం చేపట్టామన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠానికి ప్రణాళికలు అమలుచేస్తూ, వృత్తి పనులవారి ఆదాయం మెరుగుకు ప్రభు త్వ చర్యలు తోడ్పడ్డాయన్నారు. గొర్ల పంపిణీ గొల్ల కురుమలకు లాభం చేకూర్చిందని, పశు సంపద పెరిగిందని, ముఖ్యంగా గొర్రెల సంఖ్య ఎకువ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంటులో స్వయంగా కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు. ఇటీవల గొర్రెల యూనిట్ ధరను కూడా 1.75 లక్షలకు పెంచామన్నారు.
సంతోషంగా మత్స్య కారులు
చేపల పెంపకం ప్రోత్సహించడం వల్ల మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని సీఎం తెలిపారు. గీత కార్మికులకు చెట్ల పన్ను బకాయిలు రద్దు చేయటమే కాకుండా చెట్లకు పన్ను వేసే విధానాన్ని రద్దు చేశామని అన్నారు. నేత, మరమగ్గాల వారి ఆదాయాలు మెరుగు పడ్డాయని, నూలు, రంగుల మీద సబ్సిడీతోపాటు బతకమ్మ చీరెల ఉత్పత్తి ద్వారా చేతినిండా పని దొరికేలా చేశామని ముఖ్యమంత్రి అన్నారు.
నేత, గీత కార్మికులకు బీమా
రైతుబీమా మాదిరిగానే నేత, గీత కార్మికులకు బీమా సదుపాయం కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. నేత, గీత కార్మికులు ఆశావహంగా బీమా సదుపాయం కోసం వేచి ఉన్నారని, సత్వరమే అమలు విధానంపై స్పష్టత తేవాలని అన్నారు.