హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వానకాలం సాగు ఊపందుకున్నది. సాగు లక్ష్యంలో ఇప్పటివరకు 25 శాతం పంటలు వేయగా, ఇందులో అత్యధికంగా పత్తి సాగు అయ్యింది. ఈ వానకాలంలో మొత్తం 140.12 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ఇప్పటివరకు 34.36 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగుచేశారు. ఇందులో అత్యధికంగా 26.05 లక్షల ఎకరాల్లో పత్తి గింజలు నాటారు. ఆ తర్వాత వరి 96 వేల ఎకరాల్లో, కంది 3.18 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ 1.95 లక్షల ఎకరాల్లో, మక్కజొన్న 1.04 లక్షల ఎకరాల్లో, పెసర్లు 49 వేల ఎకరాల్లో సాగుచేశారు. మరో 87 వేల ఎకరాల్లో ఉద్యానపంటలు సాగయ్యాయి. మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఈ సీజన్లో ఎక్కువగా పత్తి, కంది, పెసర, ఇతర పప్పు, నూనె గింజలను పండించాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. అందుకు అనుగుణంగానే వ్యవసాయశాఖ పంటల సాగు ప్రణాళికను రూపొందించింది. వరి సాగు తగ్గించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి రైతులకు విజ్ఞప్తిచేశారు. ప్రత్యామ్నాయంగా పత్తి, కంది, ఇతర పప్పు దినుసులు, నూనె గింజల పంటలు సాగుచేయాలని కోరారు. ఈ సీజన్కు 25.5 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, జూలై వరకు అవసరమైన 8.38 లక్షల టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, ఇందులో 4.35 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉన్నదని చెప్పారు. ఇప్పటివరకు 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు జమచేసినట్టు చెప్పారు.