హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఎన్నికల ఖర్చును ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి అవసరం లేకుండా రాష్ట్రప్రభుత్వం చట్టసవరణను ప్రతిపాదించింది. ఎన్నికల ఖర్చు వివరాల దాఖలు నుంచి వారికి మినహాయింపు ఇస్తూ రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును సోమవారం శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 23లో పర్సన్ అనే పదం దగ్గర సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను మాత్రమే చేర్చారు. కొందరు వార్డు సభ్యులు ఎన్నికల్లో గెలిచినా ఎన్నికల ఖర్చుకు సంబంధించిన అఫిడవిట్లు దాఖలుచేయకపోవటంతో అనర్హతకు గురయ్యారు. దాంతో ప్రభుత్వం వార్డు సభ్యులను ఎన్నికల ఖర్చు వివరాల సమర్పణ నుంచి మినహాయిస్తూ బిల్లును అసెంబ్లీ ముందుంచింది. దీనితో పాటుగా కొత్త గ్రామాల ఏర్పాటు, గ్రామాల పరిధి మార్చడం, గ్రామ హద్దులను మార్చడానికి ముసాయిదాను అసెంబ్లీ, శాసనమండలి ముందుంచాలనే నిబంధనను తొలగిస్తూ సవరణ ప్రతిపాదించింది. చట్టంలోని సెక్షన్ 3లోని 2ఏ సరిపోతుందని, 3, 4 క్లాజులు అవసరంలేదని పేర్కొన్నారు.
శాసనసభలో సోమవారం 4 బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుతోపాటు తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లును మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీ సవరణ బిల్లును వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ సవరణ బిల్లులను అటవీ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. అంతకుముందు కాంగ్రెస్, బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తిరస్కరించారు. మంగళవారం అసెంబ్లీలో హరితహారం కార్యక్రమంపై స్వల్పకాలిక చర్చ జరుగనున్నది. జీరో అవర్ అనంతరం ఐటీ, పరిశ్రమలశాఖల ప్రగతిపై చర్చిస్తారు.