ఏటా రూ.రెండు వేల కోట్లతో అభివృద్ధి
బృహత్తర విద్యపై నివేదిక రూపొందించండి
అధికారులకు క్యాబినెట్ సబ్కమిటీ ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్స్థాయిలో అభివృద్ధి చేసేందుకు తుది మార్గదర్శకాలు రూపొందించాలని క్యాబినెట్ సబ్కమిటీ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని పాఠశాలలను ఏడాదికి రూ.2వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు స్పష్టంచేసింది. బృహత్తర విద్యా పథకం అమలుకోసం ఏర్పాటైన క్యాబినెట్ సబ్కమిటీ గురువా రం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమైంది. సబ్కమిటీ సభ్యులు కే తారకరామారావు, హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వివిధ రా ష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఏపీ పర్యటనలో పరిశీలించిన అంశాలపై చర్చించారు.
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కార్యక్రమంలో భాగంగా గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియంను బోధిస్తున్నట్టు సబ్కమిటీ పేర్కొంది. నాణ్యమైన విద్యను అందరికీ అందించినప్పుడే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయన్న ముఖ్యమంత్రి భావనకు అనుగుణంగా విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నట్టు మంత్రులు వివరించారు. గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్, దుబ్బాక, సిరిసిల్ల, సిద్దిపేటలో అత్యాధునికంగా తీర్చిదిద్దిన డిజిటల్ క్లాసుల తరహాలో ఏర్పాట్లు చేస్తామని మంత్రులు తెలిపారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనకు విద్యావిధానాన్ని సాధనంగా మలుస్తామని చెప్పారు. ప్రాథమిక విద్యను పటిష్టపరుచడం ద్వారానే ఉన్నత విద్యారంగాన్ని సమర్థంగా నిర్వహించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సామాజిక అభివృద్ధి దృక్పథంతో విద్యారంగంపై అధికంగా నిధులు ఖర్చుచేయబోతున్నట్టు తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి అదనపు గదులు, నూతన భవనాలు, తాగునీరు, డిజిటల్ తరగతులు, తదితర మౌలిక సదుపాయాలను సంపూర్ణంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనపై నివేదిక రూపొందించాలని, దానిని ముఖ్యమంత్రికి సమర్పిస్తామని చెప్పారు. సీఎం తుది నిర్ణయం మేరకు బృహత్తర విద్యాపథకం పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కార్యదర్శి రఘునందన్రావు, విద్యాశాఖ సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు.