హైదరాబాద్, సైదాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనాథ పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య, వైద్య సదుపాయం కల్పిస్తున్నామని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అనాథ పిల్లల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.7 కోట్లతో సైదాబాద్, నింబోలిఅడ్డలో నూతనంగా నిర్మించిన వీధి బాలుర, బాలికల వసతి గృహాల సముదాయాలను శుక్రవారం హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్లతో కలిసి మంత్రి సత్యవతి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పోలీసుశాఖ ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా నాలుగు వేల మంది బాల కార్మికులకు విముక్తి కల్పించగా, వారిలో వేయి మందిని ప్రభుత్వ సదనాల్లో చేర్పించామన్నారు. ప్రభుత్వ అధ్వర్యంలో నడుస్తున్న సదనాలను ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధులు దత్తత తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాచిగూడలోని నింబోలిఅడ్డాలో రూ.3.60 కోట్లతో 75 మంది విద్యార్థులకు సరిపడే మూడంతస్థుల భవనాన్ని నిర్మించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, స్థానిక కార్పొరేటర్లు, సదనాల పర్యవేక్షణాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.