హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మహమ్మారి దాదాపు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం రోజువారీ కేసులు చాలా స్వల్పంగా నమోదవుతున్నాయి. రానున్న మూడు నెలలు పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా ఖతమైనట్టేనని, పాండమిక్ నుంచి ఎపిడమిక్ (విపత్తు నుంచి అంటు వ్యాధి) దశకు చేరుకున్నట్టేనని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరేందుకు ప్రభుత్వం, ప్రజలు ఎంతో శ్రమించాల్సి వచ్చిందని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలిపారు. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సమయంలో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పండుగల వేళ ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ప్రజలు భౌతిక దూరాన్ని పూర్తిగా విస్మరించారని, కేవలం 20% మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. కనీసం జనవరి వరకు కొవిడ్ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు.
రెండో డోసుపై 25 లక్షల మంది నిర్లక్ష్యం
రాష్ట్రంలో మొదటి డోసు తీసుకున్నవారిలో 25 లక్షల మంది ఇంకా రెండో డోసు తీసుకోలేదని, నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని ఆందోళన శ్రీనివాసరావు వ్యక్తం చేశారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 2.75 కోట్ల లక్షిత జనాభాలో ఇప్పటివరకు 72% మంది మొదటి డోసు, 39% మంది రెండో డోసు తీసుకున్నట్టు వెల్లడించారు. తొలి కోటి డోసుల పంపిణీకి 160 రోజులు పట్టిందని, రెండవ కోటి డోసుల పంపిణీని 78 రోజుల్లోనే పూర్తిచేశామని వివరించారు. కొవిడ్ వ్యాక్సిన్లకు రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదని, 30 లక్షల డోసుల నిల్వ ఉన్నదని చెప్పారు. జైకోవ్-డీ వ్యాక్సిన్కు కేంద్రం అనుమతిస్తే పంపిణీకి సిద్ధంగా ఉన్నామని శ్రీనివాసరావు తెలిపారు.