ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 1: గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాల నిర్మాణా పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ అన్నారు. మండల పరిధిలోని మర్పల్లిగూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామాన్ని పరిశీలించారు. పంచాయతీల పరిధిలో చేపట్టిన వైకుంఠధామాల నిర్మాణ పనులను జాప్యం చేయరాదని, నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.
మర్పల్లిగూడ,ఘనపూర్ గ్రామాల్లో స్థలం లేక డంపింగ్ యార్డు నిర్మాణం పనులు సాగడం లేదని మండ ల అధికారులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తులతో చర్చించి డంపింగ్యార్డు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ పద్మజరాణి, ఎంపీడీఓ అరుణ, ఎంపీఓ అనంతలక్ష్మి, ఉప సర్పంచ్ మాయ నరేశ్, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చిలుగూరి సాయి తదితరులు పాల్గొన్నారు.