సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుల తరబడి చికిత్స పొంది… ఆయా ఆస్పత్రులు చేతులెత్తేయడంతో చివరి నిమిషంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న రోగులే వైద్యులకు సవాల్గా మారుతున్నారు. కానీ నిర్ణీత సమయంలో సర్కారు దవాఖానాలను ఆశ్రయిస్తున్న కొవిడ్ రోగులు మెరుగైన వైద్య సేవలతో రోగం నయమై.. చిరు నవ్వుతో ఇంటి బాట పడుతున్నారు. ఇందుకు ఆయా ఆస్పత్రుల్లో రోగం నయమైన (రికవరీ) వారి సంఖ్యనే నిదర్శనం. ముఖ్యంగా గాంధీ ఆస్పత్రిలోనూ రోజుకు పదుల సంఖ్యలో కొవిడ్ రోగులు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అవుతున్నారు. ఈనెల 21వ తేదీ నుంచి సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు ఏకంగా 316 మంది కొవిడ్ రోగులు మెరుగైన వైద్య సేవలతో కోలుకొని పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి కావడం విశేషం. దీంతో పాటు కొవిడ్ సెంటర్గా ఉన్న కింగ్ కోఠి ఆస్పత్రిలోనూ రికవరీ రేటు ఏకంగా 92 శాతానికి పైగా ఉందంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు ఎంత మెరుగ్గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.