హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): స్వల్ప జ్వరం లక్షణాలున్నవారు వెంటనే సమీపంలోని దవాఖానలో కరోనా పరీక్షలు చేయించుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ సూచించారు. లక్షణాలు ఉన్నవారికి రిపోర్టు కోసం ఆగకుండా వెంటనే మందుల కిట్ను అందించి చికిత్స ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో చేపట్టిన ర్యాపిడ్ ఫీవర్ సర్వేను గురువారం సీఎస్ ఆకస్మికంగా తనిఖీచేశారు. బొగ్గులకుంట అర్బన్హెల్త్ సెంటర్లో కరోనా ఔట్ పేషెంట్ సర్వీసుల నిర్వహణను, జ్వరం లక్షణాలతో వచ్చినవారికి అందిస్తున్న మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జ్వరం నాలుగు, ఐదు రోజులపాటు ఉంటే స్టిరాయిడ్ను వాడాలని, దీని వలన దవాఖానలో చేరికను నివారించవచ్చని చెప్పారు. స్వల్ప జ్వర లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని దవాఖానల్లో ఓపీ చికిత్సకు హాజరై ఉచితంగా అందజేసే మందులను వాడాలని సూచించారు. ఈ పర్యటనలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.