హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. కరోనా మహమ్మారి తిరగబెడుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించి, నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కువ జనాభాగల, రద్దీగా ఉండే ప్రాంతాలైన.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలతోపాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలు కరోనా పట్ల మరింత అప్రమత్తతతో మెలగాలని సీఎం కేసీఆర్ సూచించారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం కేసీఆర్.. అనంతరం వైద్యారోగ్యశాఖ అధికారులతో రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని విభాగాల ఫ్రంట్లైన్ వర్కర్లకు వందశాతం వ్యాక్సినేషన్ చేయించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రక్రియను వారంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్శర్మతో ఫోన్లో మాట్లాడారు. వారి శాఖల్లో పనిచేసే సిబ్బంది మొత్తానికి వాక్సినేషన్ ప్రక్రియను వారంలో నూరుశాతం పూర్తిచేయాలని ఆదేశించారు. వాక్సినేషన్ పురోగతిని ప్రతిరోజు ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎంవోకు రిపోర్ట్ చేయాలన్నారు. పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్టీసీ, రెవెన్యూ శాఖల సిబ్బందికి వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు కలెక్టర్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులతో వెంటనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు.
కరోనా కేసులు పెరుగుతున్నందున పరీక్షలను భారీగా పెంచాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని జిల్లాల్లోనూ ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను పెంచాలన్నారు. ఆర్టీపీసీఆర్ కిట్ల కొరత లేకుండా చూడాలని, అవసరమైన కిట్లను వెంటనే తెప్పించాలని చెప్పారు. గద్వాల, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, భువనగిరి, జనగామ, వికారాబాద్ కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను తక్షణమే ఏర్పాటుచేయాలని వైద్య అధికారులను సీఎం ఆదేశించారు.
కరోనా నియంత్రణ కోసం నిబంధనలను, ముఖ్యంగా మాస్క్ నిబంధనను మరింత కఠినంగా అమలుచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మాస్కు ధరించకపోతే వెయ్యి జరిమానా విధించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఈ నిబంధనను అందరూ పాటించేలా పోలీస్శాఖ చర్యలు తీసుకోవాలని డీజీపీకి చెప్పారు. 45 ఏండ్లు పైబడిన వారంతా టీకాలు తీసుకోవాలని సీఎం కోరారు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రావు, డీఎంఈ రమేశ్రెడ్డి, టీఎస్ఎమ్మెస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్, వైద్యశాఖ సలహాదారు డాక్టర్ టీ గంగాధర్ పాల్గొన్నారు.