హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, కొన్నిరోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా థర్డ్వేవ్పై ఆందోళన వద్దని, వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని స్పష్టంచేశారు. సోమవారం కోఠిలోని తన కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. గతంతో పోల్చితే ప్రభుత్వ దవాఖానల్లో బెడ్ ఆక్యుపెన్సీ 16 శాతం తగ్గిందని చెప్పారు. లాక్డౌన్ మొదట్లో రాష్ట్రంలో 6.47శాతం పాజిటివిటీ రేటు ఉండగా, ప్రస్తుతం 1.36 శాతానికి పడిపోయిందని అన్నారు. రికవరీ రేటు 90 శాతం నుంచి 96 శాతానికి పెరిగిందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది కరోనా బారిన పడకుండా ఇంటింటికి జ్వరసర్వే దోహదం చేసిందన్నారు. బ్లాక్ఫంగస్కు తెలంగాణ సొంతంగా ఔషధాలు తయారుచేసుకున్నదని తెలిపారు. కరోనా చికిత్సకు సంబంధించి ప్రైవేటు దవాఖానలపై ఇప్పటివరకు 350 ఫిర్యాదులు వచ్చాయని, వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తెలిపారు.
త్వరలో డ్వాక్రా మహిళలకు వ్యాక్సిన్
వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రం వ్యూహత్మకంగా వ్యహరిస్తున్నదని శ్రీనివాసరావు తెలిపారు. హైరిస్క్ గ్రూప్ కోసం ప్రారంభించిన ప్రత్యేకడ్రైవ్ పూర్తయిందని ప్రకటించారు. మే 25 నుంచి ఈ నెల 13 వరకు 16.74 లక్షల మందికి టీకాలు వేయగా, ఇందులో 13 లక్షల మందికి పైగా హైరిస్క్గ్రూప్ వారేనని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80లక్షల మందికి టీకాలు వేశామని, నెలాఖరు కల్లా మరో 20 లక్షల మందికి వేస్తామని అన్నారు. త్వరలో స్వయం సహాయక సంఘాల మహిళలకు టీకాలు వేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ కేంద్రాలద్వారా రోజూ 2 లక్షల మందికిపైగా టీకాలు వేస్తామని, ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర 9లక్షల డోసులు నిల్వ ఉన్నాయని చెప్పారు.
థర్డ్వేవ్ వచ్చినా.. సిద్ధం
కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని డీఎంహెచ్ తెలిపారు. ఎవరిపై థర్డ్వేవ్ ప్రభావం ఉంటుందో కచ్చితమైన ఆధారాలు లేవని చెప్పారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఒక టీవీ చానల్ లైవ్లో థర్డ్వేవ్పై ఇష్టారాజ్యంగా మాట్లాడిన కెమికల్ ఇంజనీర్పై పోలీలకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆయన బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం ఆయనపై సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
నెలాఖరుకు ప్రతిబెడ్.. ఆక్సిజన్బెడ్
ఈ నెలాఖరునాటికి ప్రభుత్వ దవాఖానల్లోని ప్రతిబెడ్కు ఆక్సిజన్ సరఫరా చేసి, ఆక్సిజన్ బెడ్గా మార్చుతామని డీఎంఈ రమేశ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆక్సిజన్ జనరేటర్స్ సిద్ధమవుతున్నాయని అన్నారు. గత నెలరోజుల్లో కొత్తగా 5వేల ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేశామని వివరించారు. పిల్లల కోసం రాష్ట్రంలో 6వేల బెడ్స్ అదనంగా సిద్ధంచేస్తున్నామని అన్నా రు. నిలోఫర్ దవాఖానలో 2వేల బెడ్స్ ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. రెండోవేవ్లో చిన్నపిల్లల కేసులు 500 కూడా రాలేదని పేర్కొన్నారు.