అచ్చంపేట రూరల్, జూన్ 8 : దేశంలోనే రెండో అతి పెద్ద అభయారణ్యమైన నల్లమల అటవీ ప్రాంతం ప్రకృతి రమణీయ దృశ్యాలకు నెలవు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, గుంటూరు, కర్నూల్, ప్రకాశం జిల్లాలో మొత్తం 3,568 చదరపు కిలోమీటర్ల వరకు అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నది. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న నల్లమల అడవులు రాష్ట్ర విభజనతో రెండుగా చీలిపోయాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అమ్రాబాద్ అభయారణ్యాన్ని ప్రత్యేక పులుల సంరక్షణ ప్రాంతంగా గుర్తించి.. అటవీ జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అచ్చంపేట మండలంలోని బక్కలింగయ్యపల్లి మొదలుకొని నాగార్జునసాగర్ డివిజన్ పరిధిలోని 2,196 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలుపుకొని పులుల సంరక్షణ ప్రాంతం (అమ్రాబాద్ అభయారణ్యం)గా గుర్తించారు. నాటి నుంచి ప్రతి ఏడాది అడవి, జంతువుల రక్షణకు 20 బేస్ క్యాంపుల పరిధిలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. 2019 అటవీ జంతువుల ఘణన ప్రకారం.. 23 పెద్ద పులులు, 100 చిరుత పులులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దుప్పులు, కడ్తులు, జింకలు, నెమళ్లు, పందులు, కోళ్లు, కుందేళ్లు, నక్కలు, అటవీ కుక్కలు మొదలైన జంతువులు వేల సంఖ్యలో ఉన్నాయి.
అడవుల విస్తీర్ణం పెరగడంతో జంతువులు సైతం అధికమయ్యాయి. అటవీశాఖ అధికారుల ఆదేశాల మేరకు బీట్ స్థాయి అధికారులు, బేస్ క్యాంపు వాచర్లు నిత్యం 20 నుంచి 25 కిలోమీటర్ల మేర పర్యవేక్షణ చేపడుతున్నారు. అయినప్పటికీ అధికారులు, సిబ్బంది కళ్లు కప్పి వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడి చంపుతున్నారు. పథకం ప్రకారం ఇనుప ఉచ్చులు, గొడ్డళ్లు, బాణాలు మొదలైన మరణాయుధాలతో అడవిలోకి ప్రవేశించి జంతువులను చంపి వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో పదర మండలంలోని మద్దిమడుగు శివారులో ఉన్న ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులో వన్యప్రాణులను వేటాడిన సంఘటన కలకలం రేపింది. అటవీశాఖ సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు భద్రతను కట్టుదిట్టం చేయగా.. ఏప్రిల్ 26న వేటగాళ్లు పట్టుబడ్డారు. వారి నుంచి రెండు చుక్కల దుప్పుల కళేబరాలను (30 కిలోల మాంసం) స్వాధీనం చేసుకున్నారు. సంఘటనలో గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా.. కృష్ణా నదిలో నుంచి బోట్ సాయంతో మద్దిమడుగు చేరుకొని అడవిలోకి ప్రవేశించి జంతువులను వేటాడినట్లు ఒప్పుకున్నారని రేంజ్ అధికారి ఆదిత్య పేర్కొన్నారు. పట్టుబడిన వ్యక్తులను రిమాండ్కు తరలించారు.
ఇదిలా ఉండగా, అచ్చంపేట మండలం చౌటపల్లి సమీపంలోని మశమ్మ మడుగు ప్రాంతంలో అటవీ జంతువుల వేట ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మశమ్మ మడుగు ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాలను మే 26న పరిశీలించ గా.. మే 3, 7వ తేదీల్లో వేటగాళ్లు ఉచ్చులు, గొ డ్డళ్లతో అటవిలోకి వెళ్లినట్లు గమనించారు. ట్రాప్ కెమెరాల పూర్తి విచారణతో నిందితులు అచ్చంపేట మండలంలోని గుంపన్పల్లికి చెందిన వారి గా గుర్తించారు. ఉడతనూరి లింగం, దాసరి శ్రీశై లం, ఉడతనూరి అంజి, కేతావత్ నిరంజన్, వ డ్త్యావత్ బాలాజీ, బాణావత్, లక్ష్మణ్, రాత్లావత్ శివ, ముడావత్ శ్రీను, కొర్ర గణేశ్, కొర్ర రాంచరణ్లను అదుపులోకి తీసుకున్నారు. రోజు కొంత మంది చొప్పున పది మంది వేటగాళ్లు అడవిలోకి ప్రవేశించి చుక్కల దుప్పి, సాంబర్లను చంపి జంతువు కాళ్లను గొడ్డళ్లతో నరికి విడి భాగాలుగా చేసి తీసుకెళ్లినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో జూన్ 3న నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు రేంజ్ అధికారి మనోహర్ పేర్కొన్నారు. అనుమతి లేకుండా అడవిలోకి ప్రవేశిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుటాంమని ఆయన హెచ్చరించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ అడవి అభివృద్ధి, జంతువుల సంరక్షణకు సహకరించాలన్నారు.