హైదరాబాద్ : టీకాల విషయంలో దేశ సగటు కంటే తెలంగాణ మెరుగ్గా ఉందని.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కొవిడ్ నియంత్రణ, సంబంధిత అంశాలపై గురువారం మంత్రి కేటీఆర్ ప్రజలతో ట్విట్టర్ వేదికగా సంభాషించారు. ఈ సంభాషణలో భాగంగా కొవిడ్కు సంబంధించి నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆస్క్ కేటీఆర్ పేరిట జరిగిన ఈ సంభాషణ జాతీయస్థాయిలో ట్విట్టర్ ట్రెండింగ్లో నంబర్ వన్గా నిలిచింది. పలు అంశాలపై మంత్రి కేటీఆర్ సంభాషణ తాలూకు ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
• ప్రస్తుతం తెలంగాణ లాక్డౌన్ సమర్థవంతంగా కొనసాగుతుంది. ప్రజల అత్యవసరాల కోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు ఉంది. కొంతమంది సంపూర్ణ లాక్డౌన్ విధించాలని తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా ప్రజల సౌకర్యార్థం ఈ నాలుగు గంటల పాటు వెసులుబాటు ఇస్తున్నామని.. దీంతో పాటు ఈ-కామర్స్ ద్వారా ప్రజల అవసరాలు తీరేలా పూర్తి వెసులుబాటు కల్పించామన్నారు
• ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు లాక్డౌన్ వల్ల కరోనా కొంత తగ్గుముఖం పడుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు
• ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డెసివిర్ వంటి మందుల సరఫరాను ప్రభుత్వమే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందజేయాలన్న సూచనకు స్పందించిన కేటీఆర్… ఆక్సిజన్ సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని, ఆక్సిజన్ సరఫరా విషయంలో దేశం సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. మరోరోవైపు రెమ్డెసివిర్ మందుల వినియోగంలో ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ, పర్యవేక్షిస్తుందన్నారు. మరోవైపు ఆక్సిజన్, రెమ్డెసివిర్ మందులను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న అనేక మందిని ఇప్పటికే అరెస్టు చేసిన విషయాన్ని తెలిపారు.
• ప్రైవేట్ ఆసుపత్రులు కొవిడ్ రోగులను దోచుకుంటున్నాయని, ఇందుకు సంబంధించి చికిత్స ఖర్చు విషయంలో జాతీయ స్థాయిలో ఏకీకృత విధానం రూపొందించాలని, చేసిన సూచనకు స్పందించిన కేటీఆర్, ఈ అంశం పైన దృష్టి సారిస్తున్నారు.
• రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదని ఇందుకోసం ఇప్పటికే 28 వేల బృందాలను ఏర్పాటు చేసి 60 లక్షల ఇళ్లను తమ వైద్య యంత్రాంగం సందర్శించినదని, ఈ భారీ ప్రయత్నం యొక్క సానుకూల ఫలితాలు త్వరలో వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
• తమ మంత్రులంతా కూడా జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కలెక్టర్ మరియు డీఎంహెచ్ఓ స్థానిక ఆసుపత్రుల అధికారులతో ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రయత్నంలో నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలను కూడా భాగస్వాములు అవుతారన్నారు.
• కరోనా సోకిన సందర్భంగా మానసిక, శారీరక ఆరోగ్యంపైన అత్యంత ప్రభావం చూపిస్తున్నదని, ఈ విషయంలో కొవిడ్ను ఎలా ఎదుర్కొన్నారు, కొవిడ్ వచ్చిన వారికి మీరిచ్చే టిప్స్ ఏమిటని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. సొంత వైద్యం పనికిరాదని కేవలం వైద్య నిపుణులు సూచించిన ప్రామాణిక పద్ధతుల్లోనే వైద్యం తీసుకోవాలన్నారు. మానసికంగా బలంగా ఉండాలని, కొవిడ్ రికవరీ తర్వాత ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అసత్యాలను, అర్ధ సత్యాలను ప్రచారం చేసే సోషల్ మీడియా, టీవీ చానల్స్ వంటివాటికి దూరంగా ఉండాలని, ముఖ్యంగా వాట్సాప్ నిపుణుల సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోద్దన్నారు. వీలుంటే వ్యాయామం చేస్తే మంచిదన్నారు.
• తనకు కరోనా సోకినప్పుడు వరుసగా ఏడు రోజులపాటు తక్కువ నుంచి అతి ఎక్కువ డీగ్రీల జ్వరం కొనసాగిందని, దాంతోపాటు ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ కూడా ఉన్నదని… తాను డయాబెటిక్ అయినందున బ్లడ్ షుగర్, హైపర్టెన్షన్ నియంత్రణ కొంత సవాలుగా ఉండిందని, అయితే డాక్టర్ల సరైన సూచనలు సలహాలతో అధిగమించినట్లు తెలిపారు.
• ఇప్పటికే వ్యాక్సిన్ కార్యక్రమంలో జాతీయ సగటు కన్నా తెలంగాణ ముందువరసలో ఉన్నదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు సైతం తెలంగాణ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నదని, దీన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు వ్యాక్సిన్ సరఫరానే అతి పెద్ద అడ్డంకి అని కేటీఆర్ అన్నారు. వ్యాక్సిన్లు సరఫరా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నందున, రాష్ట్రానికి కావలసిన మేరకు వ్యాక్సిన్లు అందడం లేదన్నారు.
• వ్యాక్సిన్ తయారీదారులతోను రాష్ట్ర ప్రభుత్వం సమావేశం అవుతుందన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ లతో మాట్లాడుతున్నామన్నారు. రానున్న ఆగస్టు నాటికి వ్యాక్సిన్ల సరఫరా తగినంత ఉండే అవకాశం ఉందన్నారు. అప్పటివరకు వాక్సినేషన్ కార్యక్రమం కొంత సవాల్తో కూడుకున్నది అన్నారు.
• త్వరలోనే ఫైజర్, మోడర్నా కంపెనీల వ్యాక్సిన్ లకు సైతం అనుమతి లభిస్తుందని, ఆగస్టు మాసాంతానికి దేశీయంగా బయోలాజికల్-ఈ తయారుచేస్తున్న వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
• రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నియంత్రణ కోసం చేస్తున్న ప్రయత్నాలను కొంతమంది దుష్ప్రచారం, అసత్యాలతో బద్నాం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలతో అయోమయానికి గురి కావద్దని, ఇవన్నీ రాజకీయ దురుద్దేశాలతో కూడినవే అని అన్నారు.
• ఇతర రాష్ట్రాల కొవిడ్ రోగులకు చికిత్స అందించే ప్రయత్నంలో భాగస్వాములుగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 4 రాష్ట్రాలకు కేంద్రంగా రోగులకు చికిత్స అందిస్తున్న హైదరాబాద్ నగరానికి కేంద్రం అందిస్తున్న ఆక్సిజన్, మందుల కోటాను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
• కొవిడ్ ద్వారా తమ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
• ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే మల్టీ విటమిన్లు, ఇతర ప్రాథమిక మందులను తీసుకోవడం ప్రారంభించాలని, టెస్ట్ రిజల్ట్ కోసం వేచి ఉండొద్దన్నారు.
• మొదటి దశ కొవిడ్ సంక్షోభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం నేర్చుకుందని ప్రశ్నించిన పలువురికి సమాధానంగా మంత్రి ఈ సందర్భంగా కొన్ని గణాంకాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా సెప్టెంబర్ నాటికి ఆక్సిజన్ బెడ్లు రాష్ట్రంలో 9,213 ఉంటే ప్రస్తుతం అవి 20,739 గా ఉన్న అంశాన్ని ప్రస్తావించారు.