నల్లగొండ, జూన్ 8 : కాలంతోపాటే వ్యవసాయం చేసే తీరు కూడా మారుతున్నది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ప్రకృతి విపత్తుల బారిన పడకుండా, త్వరగా అమ్ముకునేలా యాంత్రీకరణకు సద్వినియోగం చేసుకుంటూ రైతాంగం ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో సన్న వడ్లు అన్నదాత కష్టాలను గట్టెక్కిస్తున్నాయి. అందులోనూ పచ్చి కటింగ్(పచ్చి ధాన్యం) వెరైటీలు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయి. పంటను కోసి, ఆరబోసి, తూర్పార పట్టి డ్రై అయ్యాక అమ్ముకోవడం శ్రమ, రిస్క్తో కూడుకున్నది అవడంతో రైతులు కూడా సన్న రకాల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పంట కాలంలో ఎక్కువ దిగుబడి ఇస్తున్న జీనెక్స్ సీడ్స్.. పూజిత వెరైటీని ఆయకట్టు రైతులు ఇందుకో ఉదాహరణగా చూపుతున్నారు.
నీళ్లు పుష్కలం.. తగ్గిన పంట కాలం
సమైక్య పాలనలో సాగునీటికి ఉమ్మడి జిల్లా రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు తెలియనివి కాదు. సన్నరకం వరి సాగుకు ఎక్కువ నీళ్లు అవసరమయ్యేవి. పంట కాలంతోపాటు తెగుళ్ల బెడద ఎక్కువ ఉండేది. పెట్టుబడి ఖర్చు పెరిగేది. అయినా దిగుబడి ఎకరాకు 30 నుంచి 35 బస్తాలకు మించి వచ్చేది కాదు. ఈ సమస్యలతోనే 120 రోజుల్లో చేతికొచ్చే దొడ్డు రకాల వైపు రైతులు మళ్లారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఓ వైపు కృష్ణా జలాల్లో మన నీటి వాటా నిక్కచ్చిగా అందుతున్నది. మరోవైపు కాళేశ్వరం జలాలతో బీడు భూములు గోదారమ్మ పరవళ్లు తొక్కుతున్నది. మూసీ ప్రాజెక్టు, ఎత్తిపోతల ఆధునీకరణతో స్థిరీకరించిన ఆయకట్టు మొత్తానికి నీళ్లందుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే వ్యవసాయ శాస్త్రవేత్తలు బ్రీడింగ్ ద్వారా సన్న రకం వైరెటీల పంట కాలాన్ని నాలుగు నెలలకు తగ్గించారు. ఆ వెరైటీల్లో జీనెక్స్ సీడ్స్ కంపెనీకి చెందిన పూజిత రకం ఎకరాకు 45 బస్తాలకుపైగా దిగుబడి వస్తున్నదని యాసంగిలో సాగు చేసిన రైతులు చెబుతున్నారు. మిల్లర్లు పచ్చి ధాన్యాన్నే కొనుగోలు చేస్తుండడంతో టన్నేజీ కూడా బాగా వస్తుందని పేర్కొంటున్నారు.
ఆయకట్టులో సగానికిపైనే..
నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో ఆరు సీజన్ల నుంచి పచ్చి కటింగ్కు అందివచ్చే సన్న రకాలనే 80 శాతం మేర పండిస్తున్నట్లువ్యవసాయ యంత్రాంగం చెప్తోంది. యాసంగిలో జీనెక్స్ సీడ్స్ కంపెనీకి చెందిన పూజిత వెరైటీ 120 నుంచి 130 రోజుల్లోనే చేతికి వచ్చినట్లు చెబుతున్నారు. నల్లగొండ, నకిరేకల్లోనూ అధునాతన మిల్లులు ఏర్పాటవడంతో సన్నాల సాగు మొదలైంది. ధాన్యాన్ని ఆరబెట్టి విక్రయించాల్సిన పని లేకపోవడంతో ఈసారి ఎక్కువమంది ఆ వైపు ఆలోచన చేస్తున్నారు. సన్న రకాల్లో తేమ శాతం 25శాతానికి మించి ఉన్నా మిల్లర్లు కొనుగోలు చేసి, వెంటనే స్టీమ్ చేస్తున్నారు. నూక కూడా రాకపోవడం అటు మిల్లర్లకూ లాభసాటిగా మారింది. రైతుకు క్వింటాకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు ధర లభిస్తున్నది.