తిమ్మాపూర్ రూరల్, మే1: కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడిన ఆ పల్లె కోలుకున్నది. ఇండ్ల వద్దే చికిత్సపొందుతూ కట్టుదిట్టమైన చర్యలతో తేరుకున్నది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని గొల్లపల్లి. 1100 మంది జనాభా ఉన్న ఈ ఊరిలో ఏప్రిల్ మొదటివారంలో కరోనా విలయతాండవం చేసింది. మూడు రోజుల వ్యవధిలో 50 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో సర్పంచ్ అంజయ్య నేతృత్వంలోని పాలకవర్గం వైరస్ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 7 నుంచి 22 దాకా లాక్డౌన్ విధించారు. కరోనా బాధిత కుటుంబాలకు గ్రామానికి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు అండగా నిలిచారు. గుడ్లు, డ్రైఫ్రూట్స్, నిత్యావసరాలు అందించి ఆదుకున్నారు. కరోనాభారిన పడ్డ 50 మందిలో ఏ ఒక్కరూ ప్రైవేట్ దవాఖానకు వెళ్లలేదు. స్థానిక ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఇచ్చిన మెడికల్ కిట్లలోని మందులనే వాడారు. వారు చెప్పిన జాగ్రత్తలను తూ.చ. తప్పకుండా పాటించారు. ప్రస్తుతం 44 మంది కరోనా కోరల్లోంచి బయటపడ్డారు. కేవలం ఆరుగురు స్వల్పలక్షణాలతో హోంఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఒక్కోక్కరికీ నెగెటివ్ వస్తుండటంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకుంటున్నారు.