హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): మామిడి రైతుపై కరోనా మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపుతున్నది. రాష్ట్రంలో పండే మామిడి ఇతర రాష్ర్టాలకు.. ప్రధానంగా ఢిల్లీకి రవాణా చేస్తారు. ఢిల్లీలో లాక్డౌన్తో రవాణా నిలిచిపోవడంతో సెర్ప్ ఆధ్వర్యంలో సేకరించే మామిడిపై ప్రభావం పడింది. రాష్ట్రంలోనూ కరోనా ప్రభావంతో కొంతవరకు కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్లోనే ఎక్కువగా విక్రయాలు జరిగేలా చర్యలు చేపడుతున్నారు. కనీసం 100 కిలోలు కొనుగోలుచేసే వారికి డోర్ డెలివరీ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని మహిళాసంఘాల్లోని రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో బెనిషాన్ ప్రొడ్యూసర్ కంపెనీని ఏర్పాటుచేశారు. ఇది రైతుల నుంచి వివిధ రకాల పంటలను నేరుగా కొనుగోలు చేసి మార్కెట్లో విక్రయిస్తుంది. 2019లో నాలుగు జిల్లాల్లోని రైతుల నుంచి 92 మెట్రిక్ టన్నుల మామిడిని సేకరించారు. 2020లో ఏడు జిల్లాల్లోని రైతుల నుంచి 634 మెట్రిక్ టన్నులు, 2021లో 13 జిల్లాల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీవో) నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు 290 మెట్రిక్ టన్నులను సేకరించారు. ఈ ఏడాది 2 వేల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించినప్పటికీ కొన్ని రాష్ర్టాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేయడం కష్టంగా మారింది. దీంతో నిర్ధేశించిన లక్ష్యాన్ని 1,500 మెట్రిక్ టన్నులకు కుదించారు. అది కూడా కష్టంగా మారింది.
శాస్త్రీయపద్ధతిలో మాగబెట్టి..
రైతుల నుంచి నేరుగా సేకరించిన మామిడిని బెన్షాన్ కంపెనీ శాస్త్రీయపద్ధతిలో మాగబెట్టి విక్రయిస్తుంది. హైదరాబాద్లో ట్రేడర్లు, బయ్యర్లు, గేటెడ్ కమ్యూనిటీ, కాలనీవాసులు, అపార్ట్మెంట్వాసులకు డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించారు. కనీసం 100 కిలోలు కొనుగోలు చేస్తే నేరుగా ఇంటికే పంపిస్తున్నారు. ఇందుకొసం బెనిషాన్ ప్రొడ్యూసర్ కంపెనీ మేనేజర్ క్రాంతికుమార్ 63012 95843 నంబర్ వాట్సప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించనున్నారు. ఆర్డర్ చేసిన 24 గంటల్లో డెలివరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బిగ్ బాస్కెట్, రత్నదీప్, రిలయన్స్, బోయినపల్లి మార్కెట్ సహా అనేక మాల్స్కు వీటిని విక్రయిస్తున్నారు.