హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): యుద్ధం గెలవాలంటే వ్యూహం ఉండాలి. ఆ వ్యూహం శత్రువుకు ఊపిరి తీసుకొనే సమయం కూడా ఇవ్వకుండా ఉండాలి. అచ్చం అలాంటి వ్యూహాలనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కరోనాపై ప్రయోగించారు. స్వయంగా రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్.. వైరస్ కట్టడికి వ్యూహాల అమలులోనూ తనదైన దూకుడును ప్రదర్శించారు. టీకాలు వేస్తే సరిపోదని అనుకొన్న సీఎం.. కరోనా ఎక్కడ ఎక్కువ వ్యాపిస్తున్నది? ఎవరికి వ్యాక్సిన్ వేస్తే దానికి అడ్డుకట్ట వేయవచ్చు? అని విశ్లేషించారు. హైరిస్క్ గ్రూపులకు వ్యాక్సిన్ వేస్తే వైరస్ విజృంభణకు బ్రేక్ వేయవచ్చని, ఆ వ్యూహాన్ని అమలుపరిచారు. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్నదని, భౌతికదూరాన్ని పాటిస్తేనే దాన్ని అదుపుచేయవచ్చని, లాక్డౌన్ అస్ర్తాన్ని సరైన సమయంలో ప్రయోగించారు. ఇక అన్నింటికంటే.. వైరస్ వ్యాప్తిని ఆదిలోనే అంతం చేయాలని ఇంటింటికీ జ్వరసర్వే నిర్వహించి, లక్షణాలున్నవారికి వెంటనే మందులు అందించి.. దాని మూలాలపై దెబ్బకొట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో సర్కారు యంత్రాంగం అభివృద్ధి కార్యకలాపాలపై ఫోకస్ పెడుతున్నది.
ఎక్కడికక్కడ కట్టడి
పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చేవారితో సరిహద్దు జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెరుగటంతో ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేసింది.
సరిహద్దు జిల్లాలు సేఫ్
ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలతో తెలంగాణలోని సుమారు 16 జిల్లాలు సరిహద్దు పంచుకొంటున్నాయి. గతంలో ఏపీ, మహారాష్ట్ర కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల ద్వారా రాకపోకలపై ఆంక్షలు విధించే అవకాశం లేకపోవంతో, రాకపోకలు యథేచ్ఛగా సాగాయి. దీంతో వైరస్ వ్యాప్తి పెరిగింది. ఏప్రిల్ మొదటి, రెండువారాల్లో నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిని మినహాయిస్తే మిగతా కేసుల్లో దాదాపు 30% మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోనే నమోదయ్యాయ్యాయి. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 10% మహారాష్ట్ర వేరియంట్గా తేలింది. గతవారం వరంగల్, వికారాబాద్ తదితర జిల్లాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఏకంగా నాలుగింట మూడొంతుల శాంపిళ్లలో మహారాష్ట్ర వేరియంట్ను గుర్తించారు.
సంక్షేమంపై ఫోకస్..
కరోనా నియంత్రణలోకి రావటంతో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. వానకాలం ప్రారంభం కావడంతో రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమచేస్తున్నది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేసి అర్హులకు రేషన్కార్డులు ఇవ్వనున్నది. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతపై ఫోకస్ పెట్టింది. అధికారులంతా గ్రామాలకు వెళ్లేలా కార్యాచరణ అమలుచేయిస్తున్నది. ఆర్థిక కార్యకలాపాలూ మెరుగయ్యాయి. భూముల రిజిస్ట్రేషన్లు పుంజుకుంటున్నాయి. భవన నిర్మాణపనులలో వేగం పెరుగుతున్నది. కరోనా భయాందోళనల నుంచి బయటకు వస్తున్న ప్రజలు పనులపై దృష్టిపెట్టారు. మరోవైపు వ్యాక్సినేషన్ వేగం కావటంతో కరోనా థర్డ్వేవ్ ముప్పు అంతగా ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు.
1.80 లక్షల మందికి టీకా
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 1.80 లక్షల మందికి టీకాలు వేసినట్టు వైద్యారోగ్యశాఖ గురువారం విడుదలచేసిన బులెటిన్లో పేర్కొన్నది. ఇందులో 1.70 లక్షల మంది మొదటి డోసు తీసుకోగా, 9,761 మందికి రెండో డోసు వేసుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు టీకాలు తీసుకున్నవారి సంఖ్య 85 లక్షలు దాటినట్టు వైద్యారోగ్యశాఖ వివరించింది.
రాష్ట్రం- తెలంగాణలోని సరిహద్దు జిల్లాలు
మహారాష్ట్ర: నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల.
కర్ణాటక: సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల.
ఆంధ్రప్రదేశ్: నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం.
ఛత్తీస్గఢ్: జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం
కొన్ని సరిహద్దు జిల్లాల్లో కేసుల తీరిది..
జిల్లా ఏప్రిల్ 18 ఏప్రిల్ 24 మే1 మే 15 జూన్1 జూన్17
భద్రాద్రి కొత్తగూడెం 49 187 105 127 115 91
ఖమ్మం 113 339 258 203 121 129
మహబూబ్నగర్ 129 306 279 161 88 29
మంచిర్యాల 111 233 178 122 88 49
నిజామాబాద్ 360 497 301 76 18 8
సూర్యాపేట 69 168 106 21 73 89
కుమ్రంభీం ఆసిఫాబాద్ 25 90 82 27 14 1