మహబూబ్నగర్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేసి కరోనాను కట్టడి చేసేందుకు కృషి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, షాద్ నగర్ అధికారులతో కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
మరో వారం, పది రోజులు కరోనా కట్టడికి అందరం ఇంకా ఎక్కువ కష్టపడి పని చేద్దామని మంత్రి పేర్కొన్నారు.
లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారికి అవసరమైన సరుకులు, కూరగాయలు అందుబాటులో ఉండేలా చూడాలి. ధరలు నియంత్రణలో ఉండాలి. ప్రైవేట్ దవాఖానలో కూడా ఆక్సిజన్, రేమిడివిసిఆర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉండాలన్నారు.
ఫీవర్ సర్వే, కరోనా రోగుల కు సంబంధించి గ్రామాల వారీగా, మండలాల వారీగా పూర్తి వివరాలు సేకరించాలని మంత్రి తెలిపారు. అన్ని జిల్లాలలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఒకవేళ డాక్టర్ వెళ్లలేని పక్షంలో ఫోన్ ద్వారా వారి యోగక్షేమాలను కనుక్కుని మనోధైర్యం నింపాలని మంత్రి సూచించారు.
రెండు రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లాలో 500 బెడ్ లతో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో పూర్తిస్థాయిలో కరోనా వార్డు సిద్ధం చేస్తామన్నారు. మంగళవారం నాటికి షాద్ నగర్ లో 30 పడకలు ఆక్సిజన్ తో సిద్ధమవుతాయి. ఆయా జిల్లాలోని డాక్టర్లు కరోనా పేషెంట్లను ముందు ఐసోలేషన్ లో, తర్వాత ఆస్పత్రిలో ఉంచాలన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కరోనా రోగుల సహాయకులకు భోజనం ఏర్పాటు చేయాలి. గత సంవత్సరం లాగే జిల్లా కేంద్రంలో బిచ్చగాళ్లకు కేర్ సెంటర్, భోజనంఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు అవసరం అయితే నిధులు సమకూరుస్తానని హామీనిచ్చారు.
కార్యక్రమంలో..ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఎస్పీలు ఆర్ వెంకటేశ్వర్లు, చేతన, మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఇతర అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.